Parents For Online Classes | దేశంలో కరోనా కేసులు పెరిగితే ఆన్లైన్ తరగతులు నిర్వహించడమే మేలని 63 శాతం మంది తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. కొవిడ్-19 కేసులు ఇటీవల తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. శుక్రవారం 3,377 కొత్త కేసులు నమోదు కాగా, 60 మంది మరణించారు. కొన్ని రోజులుగా కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తల్లిదండ్రుల మనోగతంపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ సర్వే జరిపింది. ఒక జిల్లాలో పాజిటివిటీ రేటు రెండు శాతం దాటితే ఆన్లైన్ తరగతులు ప్రారంభించాలని 27 శాతం మంది పేరెంట్స్ తెలిపారు.
ఒక జిల్లాలో ఐదు శాతం పాజిటివిటీ రేటు దాటితే ఆన్లైన్ తరగతులు అందుబాటులోకి తేవాలని, అప్పుడు పిల్లల చదువులపై ఎటువంటి ప్రభావం చూపదని 63 శాతం మంది తల్లిదండ్రులు చెప్పారు. కేవలం 34 శాతం మంది మాత్రమే పూర్తిస్థాయి భౌతిక తరగతులు నిర్వహించాలని సూచించడం గమనార్హం. మరో 34 శాతం మంది ఇన్డోర్ లంచ్, స్నాక్స్ బ్రేక్ లేకుండా స్వల్ప కాల క్లాస్లు నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయ పడ్డారు. మిగతా 29 శాతం మంది తల్లిదండ్రులు ఒక జిల్లాలో ఐదు శాతానికి పైగా పాజిటివిటీ రేటు ఉంటే భౌతిక తరగతులు నిలిపేయాలని తేల్చి చెప్పారు.
దేశవ్యాప్తంగా లోకల్ సర్కిల్స్ 314 జిల్లాల్లో 23,500 మంది తల్లిదండ్రుల అభిప్రాయాలను సేకరించింది. వారిలో 62 శాతం మంది పురుషులు, 38 శాతం మహిళలు ఉన్నారని తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 44 శాతం మంది మెట్రోపాలిటన్ నగరాలు, ప్రధమ శ్రేణి జిల్లాల వాసులు, 34 శాతం మంది ద్వితీయ శ్రేణి, 22 శాతం మంది తృతీయ, నాల్గవ శ్రేణి జిల్లాలు, గ్రామీణ ప్రాంతాల తల్లిదండ్రులు ఉన్నారు.