భోపాల్: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఒక రాజకీయ కార్యక్రమంలో పాల్గొని సర్వీస్ రూల్స్ను అతిక్రమించినందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేస్తున్నామని అధికారులు తమ సస్పెన్షన్ ఆర్డర్లో పేర్కొన్నారు.
మధ్యప్రదేశ్ రాష్ట్రం బర్వానీ జిల్లా కనస్యలో ట్రైబల్ అఫైర్స్ డిపార్టుమెంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో రాజేశ్ కన్నోజీ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. గత నెల 24న కన్నోజీ వ్యక్తిగత పనులు ఉన్నాయంటూ పాఠశాలకు సెలవుపెట్టి రాహుల్గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో పాల్గొన్నాడు.
అనంతరం యాత్రలో పాల్గొన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. దాంతో ఉన్నతాధికారులు ఈ ఘటనను సీరియస్గా తీసుకున్నారు. రాజకీయ కార్యక్రమంలో పాల్గొని సర్వీస్ రూల్స్ను అతిక్రమించినందుకు విధుల నుంచి తొలగిస్తున్నామంటూ గత నెల 25న అతడిని సస్పెండ్ చేయగా.. విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.