శ్రీనగర్, మే 31: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు. సామాన్యులే లక్ష్యంగా వరుస దాడులకు తెగబడుతున్నారు. ఇటీవలే రాహుల్ భట్ అనే కశ్మీరీ పండిట్ ఉద్యోగిని కాల్చిచంపిన ముష్కరులు తాజాగా మరో హిందూ టీచర్ను పొట్టనపెట్టుకున్నారు. మృతురాలిని జమ్ములోని సాంబా జిల్లాకి చెందిన రజని బాలా(36)గా గుర్తించారు. ఆమె కుల్గాం జిల్లాలో గోపాల్పొరలోని ఓ పాఠశాలలో టీచర్గా పనిచేస్తున్నారు. ఉగ్రదాడిలో మరణించిన రజని బాలా కశ్మీరీ పండిట్ అని అధికారులు ముందు పేర్కొన్నారు. ఇది మే నెలలో ఉగ్రవాదుల రెండో ముస్లిమేతర ఉద్యోగి హత్య. ఈ నెలలో ఆఫ్డ్యూటీలో ఉన్న ముగ్గురు పోలీసులతో పాటు నలుగురు పౌరులను పొట్టనపెట్టుకున్నారు. తాజా ఘటన నేపథ్యంలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గోపాల్పొర ప్రాంతంలో కార్టన్ సెర్చ్ నిర్వహించాయి.
కేంద్రానివి బూటకపు మాటలు
ఉపాధ్యాయురాలి హత్యను కశ్మీర్లోని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. కశ్మీర్లో పరిస్థితులు సద్దుమణిగే వరకూ తాము విశ్రమించబోమని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏమైందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా ప్రశ్నించారు. కశ్మీర్లో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయంటూ కేంద్రం బూటకపు మాటలు చెబుతున్నదని పీడీపీ అధినేత్రి ముఫ్తీ ఆగ్రహం వ్యక్తం చేశారు. లక్షిత హత్యలు పెరగడంపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు పుల్వామా జిల్లాలో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు స్థానిక తీవ్రవాదులు హతమయ్యారు.
మూకుమ్మడిగా వలస వెళ్లిపోతాం!
తాజా హత్య నేపథ్యంలో కశ్మీరీ పండిట్లలో ఆందోళన మరింత పెరిగింది. తమను 24 గంటల్లోగా సురక్షిత ప్రాంతాలకు తరలించకుంటే కశ్మీర్ లోయ నుంచి మూకుమ్మడిగా వలస వెళ్లిపోతామని పీఎం ప్యాకేజీ పండిట్ ఉద్యోగులు మంగళవారం హెచ్చరించారు. ఉపాధ్యాయురాలి హత్యకు నిరసనగా కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో పండిట్లు ఆందోళనలకు దిగారు. హిందూ కమ్యూనిటీకి చెందిన ఉద్యోగులకు భద్రత కల్పించడంలో విఫలమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 24 గంటల్లోగా ప్రభుత్వం తమ భద్రత కోసం ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోకుంటే మరోసారి భారీ వలసలు ఉంటాయని ఆందోళనకారుల్లో ఒకరు పేర్కొన్నారు. తమను వేరే ప్రాంతాలకు మారిస్తేనే తమ ప్రాణాలకు భద్రత ఉంటుందని అన్నారు. కశ్మీరీ పండిట్లు రోడ్డుపై ఉన్నారని, బతుకుపై ఆశ పోయిందని ఖాజిగుంద్ పట్టణంలో జరిగిన నిరసనల్లో ఆందోళనకారుడు ఒకరు ఆవేదన వ్యక్తం చేశారు.