పట్నా: బీహార్ కల్తీ మద్యం తాగి ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడు సహా ముగ్గురు మరణించారు. రాష్ట్రంలో 2016లో ప్రభుత్వం సంపూర్ణ మద్యపాణ నిషేధం విధించింది. అయినప్పటికీ మందు ఏరులైపారుతున్నది. అయితే కల్తీ మద్యం తాగి జనాలు మృత్యువాతపడుతున్నారు. తాజాగా మరో ముగ్గురు బలయ్యారు. వైశాలి జిల్లాలోని మెహ్నర్లో జరిగిన విందుకు ఓ ప్రైవేటు పాఠశాల ప్రిన్సిపల్ హాజరయ్యాడు. ఈ సందర్శంగా మద్యం సేవించాడు. దీంతో అనారోగ్యానికి గురైన అతడు మరణించాడు. ఇదే తరహాలో ఓ వివాహ వేడుకలో పాల్గొన్న మరో ఇద్దరు కూడా చనిపోయారు.
ఈ మరణాలపై అధికారులు దర్యాప్తునకు ఆదేశించారు. వారి మరణాలకు గల కారణాలను తెలుసుకోవాల్సిందిగా వైద్యులను కోరారు. అనుమానాస్పదంగా మృతిచెందినా, మద్యం సేవించి చనిపోయినా తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
రెండు రోజుల క్రితం పట్నాలోని పాలిగంజ్లో ఉన్న ఎక్సైజ్ పోలీస్ స్టేషన్లో మందు పార్టీ చేసుకుంటుండగా ఇద్దరు పోలీస్ అధికారులు, మరో ఐదుగురు వ్యక్తులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.