చెన్నై: తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ రోడ్ షోకి స్కూల్ పిల్లలను సమీకరించడం వివాదాస్పదంగా మారింది. సోమవారం కోయంబత్తూరులో ఎన్నికల ప్రచారంలో భాగంగా మోదీ రోడ్షో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సాయిబాబా విద్యాలయం అనే ఎయిడెడ్ పాఠశాలకు చెందిన విద్యార్థులను తీసుకువచ్చారు. వీరంతా స్కూల్ యూనిఫామ్లోనే రోడ్షోలో పాల్గొన్నారు. పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించవద్దని ఎన్నికల నియామవళి చెప్తున్నందున అధికారులు స్పందించారు. కోయంబత్తూరు జిల్లా ఎలిమెంటరీ విద్యాధికారి పునిత ఆంటోనీయమ్మల్ మంగళవారం విచారణ జరిపి.. స్కూల్ పిల్లలను రోడ్షోకు తీసుకువెళ్లిన హెడ్మాస్టర్, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఘటనపై నివేదిక ఇవ్వాలని స్కూల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.