Supreme Court | (స్పెషల్ టాస్క్ బ్యూరో), హైదరాబాద్, (నమస్తే తెలంగాణ): ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో ఇప్పటి వరకు పక్షపాతపూరితంగా జోక్యం చేసుకొంటున్న కేంద్రప్రభుత్వ అధికారాలను దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కత్తిరించింది. ఎన్నికల సంఘంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఎన్నికల కమిషనర్ల (ఈసీ) నియామకాలను ప్రధానమంత్రి, లోక్సభలో ప్రతిపక్ష నేత, దేశ ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) సభ్యులుగా ఉన్న కమిటీనే చేపట్టాలని ఆదేశించింది. ఈ త్రిసభ్య కమిటీ చేసిన సిఫారసుల మేరకు సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి మాత్రమే నియమించాలని స్పష్టం చేసింది. పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చే వరకు ఈసీల నియామకాలు ఇలాగే జరగాలని ఆదేశించింది. ఈ మేరకు ఐదుగురు సభ్యులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం 5-0 మెజార్టీతో గురువారం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది.
సీఈసీ, ఈసీ నియామకాలకు ప్రస్తుతమున్న వ్యవస్థను రద్దు చేస్తున్నాం. నియామకాల కోసం ప్రధాని, లోక్సభలో ప్రతిపక్ష నేత, సీజేఐతో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నాం. ఈ కమిటీ సూచనల మేరకే సీఈసీ, ఈసీలను రాష్ట్రపతి నియమించాలి. పార్లమెంట్లో కొత్త చట్టం తీసుకొచ్చే వరకు ఈ నియామక ప్రక్రియ అమల్లో ఉంటుంది.
– సుప్రీంకోర్టు
ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పారదర్శకంగా జరగాలి. లేకపోతే వినాశకర పరిణామాలు తలెత్తుతాయి. రాజ్యాంగ పరిధిలోనే ఈసీ పనిచేయాలి. ఇప్పటిదాకా ఎన్నో పార్టీలు అధికారంలోకి వచ్చాయి. ఏ ఒక్క పార్టీ కూడా ఈసీల నియామకానికి అవసరమైన చట్టాన్ని చేయలేదు. దీంతో అది పూడ్చలేని అగాధంలా మిగిలిపోయింది.
– సుప్రీంకోర్టు
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ), ఇద్దరు ఎన్నికల కమిషనకర్ల (ఈసీ) నియామకాన్ని ఇప్పటివరకూ ప్రధానమంత్రి నేతృత్వంలోని మంత్రిమండలి సిఫారసు మేరకు రాష్ట్రపతి నియమించేవారు. సాధారణంగా మాజీ ఏఐఎస్లను ఈసీలుగా నియమిస్తూ వస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ చట్టం, 1991 ప్రకారం ఈసీగా నియమితులయ్యేవారు ఆరేండ్లపాటు లేదా 65 ఏండ్లు వచ్చే వరకు (ఏది ముందుగా వస్తే దాన్ని పరిగణిస్తారు) పదవిలో కొనసాగాలి.
ప్రతిపక్షాల అభ్యంతరమేంటి?
కేంద్రంలోని ప్రభుత్వ ప్రయోజనాలకు సహకరించేలా సీఈసీ, ఈసీల నియామక ప్రక్రియ ఉన్నదని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. విపక్ష నాయకుడు, సీజేఐతో కూడిన కమిటీ సిఫారసుతో నియమించే సీబీఐ డైరెక్టర్, లోక్పాల్ లాగే ఈసీల నియామకం కూడా జరుగాలని విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలో సీఈసీ, ఎన్నికల కమిషనర్ల నియామకాల కోసం కొలీజియం వంటి వ్యవస్థను రూపొందించాలని కోరుతూ పలు పిటిషన్లు దాఖలయ్యాయి. విచారణ చేపట్టిన జస్టిస్ కేఎం జోసఫ్ నేతృత్వంలోని ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది.
ఈసీల తొలగింపు ఇకపై ఎలాగంటే?
ఎన్నికల ప్రధాన కమిషనర్ను తొలగించాలంటే, ఆయనపై వచ్చిన అభియోగాలను లోక్సభ, రాజ్యసభ 2/3 మెజార్టీతో ఆమోదించాలి. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం.. ఎన్నికల కమిషనర్లను తొలగించాలంటే కూడా ఈ ప్రక్రియనే పాటించాలి. గతంలో ఇది లేదు.
ఏమిటీ కన్సాలిడేటెడ్ ఫండ్?
సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ప్రకారం.. కేంద్ర ప్రభుత్వ రెవెన్యూ ఖాతా నుంచి ప్రత్యేక నిధి ద్వారా (కన్సాలిడేటెడ్ ఫండ్) ఈసీ నిధులను సమకూర్చుకోవచ్చు. దీంతో ఈసీపై అధికార పార్టీ ప్రభావం తగ్గుతుంది.
రాజ్యాంగ ధర్మాసనంలో సభ్యులు వీళ్లే..
జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అజయ్ రస్తోగీ, జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ రుషికేశ్ రాయ్, జస్టిస్ సీటీ రవికుమార్.
గుజరాత్ ఎన్నికలకు ముందు.. గోయల్ నియామకం
కిందటేడాది డిసెంబర్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజుల ముందు కేంద్ర ఎన్నికల కమిషనర్గా అరుణ్గోయల్ను కేంద్రం హడావుడిగా నియమించింది. 24 గంటల వ్యవధిలోనే నియామకాన్ని పూర్తి చేసింది. ఎన్నికల్లో స్వార్ధప్రయోజనాల కోసమే కేంద్రం ఈ విధంగా చేసిందని ప్రతిపక్షాలు మండిపడ్డాయి.
గోయల్ నియామకంపై సుప్రీం చురకలు
ఈసీగా గోయల్ను హడావుడిగా నియమించడంపై గత నవంబర్లో సుప్రీంకోర్టు కేంద్రానికి చురకలు అంటించింది. నియామకంలో కేంద్రం ఎందుకు అంత ఆతృత చూపించిందని కోర్టు ప్రశ్నించింది. గోయల్ నియామకానికి సంబంధించిన ఫైళ్లను మెరుపువేగంతో ఆమోదించడంపై అసహనం వ్యక్తంచేసింది. గోయల్ ఫైలు కనీసం 24 గంటలన్నా ఆయా శాఖల వద్ద లేకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తంచేసింది. ‘ఏ రకమైన నియామకం ఇది? అరుణ్ గోయల్ అర్హతలను, సామర్థ్యాన్ని మేం ప్రశ్నించడం లేదు. కానీ ఆయన నియామకానికి అనుసరించిన ప్రక్రియను ప్రశ్నిస్తున్నాం. ఎన్నికల కమిషనర్ పోస్టు మే నెల 15 నుంచి ఖాళీగా ఉన్నది. కానీ నవంబర్ నెలలో మాత్రమే ప్రభుత్వం ఎందుకు తొందరపడింది? అరుణ్ గోయల్ ఒక్కరోజులోనే తాను పనిచేస్తున్న శాఖ నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ఆయన ఫైల్ను న్యాయశాఖ ఒక్కరోజులోనే ఆమోదించింది. ఒక్కరోజులోనే ఈసీ పదవి కోసం నాలుగు పేర్లను ఎంపిక చేసి ప్రధానమంత్రికి పంపింది. 24 గంటల్లో గోయల్ పేరుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. నలుగురిలో అందరికన్నా చిన్నవాడైన అరుణ్గోయల్ను ఏ ప్రాతిపదికన ఎంపికచేశారు? దీనికి అనుసరించిన పద్ధతి ఏంటి? దీనికి సమాధానం చెప్పాలి’ అని ధర్మాసనం కేంద్రాన్ని ప్రశ్నించింది.
పంజాబ్ క్యాడర్కు చెందిన ఐఏఎస్ అధికారి అరుణ్ గోయల్. కిందటేడాది నవంబర్ 19న ఈసీగా నియమితులయ్యారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ 2025 ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆ బాధ్యతలను గోయల్ స్వీకరించే అవకాశమున్నది. గోయల్ గతంలో భారీ పరిశ్రమల శాఖ కార్యదర్శిగా పనిచేశారు. అక్కడ స్వచ్ఛంద పదవీ విరమణ చేసి ఈసీగా బాధ్యతలు స్వీకరించారు.