34 ఏండ్ల కిందటి కేసులో సుప్రీం తీర్పు
న్యూఢిల్లీ, మే 19: పంజాబ్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూకు సుప్రీం కోర్టు ఏడాది పాటు జైలు శిక్ష విధించింది. 1988 నాటి ర్యాష్ డ్రైవింగ్ కేసులో దాఖలైన రివ్యూ పిటిషన్పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ ఏఎం ఖన్వీల్కర్, జస్టిస్ ఎస్కే కౌల్తో కూడిన ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఈ కేసులో బాధితుడైన 65 ఏండ్ల వృద్ధుడిని సిద్ధూ ఉద్దేశపూర్వకంగానే గాయపరిచినట్టు 2018లో సుప్రీంకోర్టు నిర్ధారిస్తూ రూ.వెయ్యి జరిమానా విధించి వదిలేసింది. అయితే జరిమానా మాత్రమే విధించడం సరికాదంటూ బాధితుడి కుటుంబసభ్యులు రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై తాజాగా తీర్పు వెలువరించింది.
ఏం జరిగింది?
బాధితుడి కుటుంబసభ్యుల ఫిర్యాదు ప్రకారం.. 1988 డిసెంబర్ 27న సిద్ధూ, ఆయన స్నేహితుడు రూపిందర్ సంధూ పటియాలాలోని షేరాన్వాలా గేట్ వద్ద రోడ్డు మధ్యలో తమ జిప్సీని పార్కు చేశారు. 65 ఏండ్ల గుర్నాం సింగ్ బ్యాంకుకు వెళ్తుండగా, రోడ్డు మధ్యలో ఉన్న జిప్సీని తీయాలని కోరారు. దీంతో సిద్ధూ, సంధూ, గుర్నాం సింగ్కు మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన సిద్ధూ.. గుర్నాం సింగ్ను తలపై కొట్టాడు. దీంతో తీవ్రంగా గాయపడిన గుర్నాం సింగ్ను దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు.