Supreme Court | న్యూఢిల్లీ, నవంబర్ 7: లైంగిక వేధింపులకు సంబంధించి సుప్రీం కోర్టు మరో కీలకమైన తీర్పునిచ్చింది. బాధితురాలు, నిందితుడు రాజీ పడినంత మాత్రాన లైంగిక వేధింపుల కేసు రద్దు కాదని స్పష్టం చేసింది. రాజస్థాన్లో విద్యార్థినిని లైంగికంగా వేధించారంటూ ఒక ఉపాధ్యాయునిపై నమోదైన కేసును నిందితుడు, బాధితురాలు రాజీ పడినందున కొట్టివేస్తూ రాజస్థాన్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం రద్దు చేసింది.
నిందితునిపై విచారణ కొనసాగాల్సిందేనని పేర్కొంది. రాజస్థాన్లోని గంగాపూర్ నగరంలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న విమల్ కుమార్ గుప్తా ఒక దళిత బాలికను లైంగికంగా వేధించినట్టు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాధితురాలి స్టేట్మెంట్ను కూడా నమోదు చేశారు. అయితే విచారణ సందర్భంగా బాధిత బాలిక తల్లిదండ్రులు స్టాంప్ పేపర్పై రాసిచ్చిన పత్రాన్ని నిందితుడు సమర్పించాడు.
పొరపాటున తాము ఉపాధ్యాయునిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, అతనిపై ఎలాంటి చట్టపరమైన చర్యను తాము కోరుకోవడం లేదని అందులో బాలిక తల్లిదండ్రులు రాసిచ్చారు. దీనిని పోలీసులు కోర్టులో సమర్పించగా, కింది కోర్టు దానిని తిరస్కరించింది. నిందితుడు హైకోర్టును ఆశ్రయించగా, న్యాయస్థానం దానిని అంగీకరిస్తూ, అతనిపై నమోదైన ఎఫ్ఐఆర్ను రద్దు చేయాలని ఆదేశించింది.
ఈ తీర్పును సవాల్ చేస్తూ సామాజిక కార్యకర్త రామ్జీ లాల్ బైర్వా సుప్రీంను ఆశ్రయించారు. దీంతో హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ పీవీ సంజయ్ కుమార్లతో కూడిన ధర్మాసనం తీర్పు చెప్పింది. బాధితులతో రాజీ పడినంత మాత్రాన అతను చేసిన నేరం రద్దయిపోదని పేర్కొంటూ నిందితుడిపై తిరిగి ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ కొనసాగించాలని తన తీర్పులో పేర్కొంది.