న్యూఢిల్లీ : సీబీఎస్, ఐసీఎస్ఈ సహా ఇతర బోర్డులు నిర్వహించే పది, 12వ తరగతి ఆఫ్లైన్ పరీక్షలను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను సుప్రీం కోర్టు బుధవారం తిరస్కరించింది. ఆఫ్లైన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గంలో పరీక్షలు నిర్వహించేలా అన్ని స్టేట్ బోర్డ్లు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐఓఎస్)ను ఆదేశించాలని పిటిషనర్ కోరగా.. జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్ నేతృత్వంలోని ధర్మాసనం తోసిపుచ్చింది.
అలాంటి పిటిషన్లు తప్పుడు భావన, గందరగోళాన్ని సృష్టిస్తాయంటూ తప్పుపట్టింది. అధికారులకు వాస్తవ పరిస్థితులపై ఎక్కువ అవగాహన ఉందని, కోర్టు జోక్యం చేసుకోకుండా నిర్ణయం తీసుకోగల సామర్థ్యం వారికి ఉందని పేర్కొంది. ‘ఇలాంటి పిటిషన్లు విద్యార్థులకు తప్పుడు ఆశలు కలిగిస్తాయని, ఇలాంటి పిటిషన్లు ఎంటర్టైన్ చేయడం వ్యవస్థలో గందరగోళాన్ని పెంచుతాయని, ఎలాంటి పిటిషన్లు దాఖలు చేస్తున్నారంటూ కోర్టు ప్రశ్నించింది. పరీక్షల వాయిదాపై గతేడాది ఇచ్చిన ఉత్తర్వును ఈ విద్యా సంవత్సరానికి సైతం ఆమోదించడం ఆనవాయితీగా మారదని ధర్మాసనం పేర్కొంది.
మరోసారి ఇలాంటి పిటిషన్లు దాఖలు చేస్తే మూల్యం చెల్లించాలని వస్తుందని హెచ్చరిస్తూ పిటిషన్ కోర్టు తోసిపుచ్చుతూ.. విద్యార్థులను, అధికారులను వారి పని చేయనివ్వాలని సూచించింది. బాలల హక్కుల కార్యకర్త అనుభా శ్రీవాస్తవ తరఫున న్యాయవాది ప్రశాంత్ పద్మనాభన్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. ఇటీవల ఏప్రిల్ 26 నుంచి 10, 12వ తరగతుల టెర్మ్-2 బోర్డు పరీక్షలు నిర్వహించాలని సీబీఎస్ఈ నిర్ణయించిన విషయం తెలిసిందే.