న్యూఢిల్లీ, ఆగస్టు 23: బినామీ చట్టాన్ని అది అమలులోకి వచ్చిన తేదీ కంటే ముందుకాలానికి వర్తింపజేయడం కుదరదని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. ఆ చట్టంలోని 3(2) సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. అనేక వాణిజ్య సంస్థలు ఈ తీర్పు కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. బినామీ లావాదేవీల నిషేధ సవరణ చట్టం 2016 నవంబర్ 1 నుంచి అమలులోకి వచ్చింది. ఆ తేదీ నుంచే ప్రామాణికంగా చట్టం వర్తిస్తుందని అంటూ అంతకుముందర తీసుకున్న చర్యలను కోర్టు పక్కనపెట్టింది.
బినామీ లావాదేవీలు జరిపే వ్యక్తికి మూడేండ్ల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చని సవరణ చట్టం సూచిస్తున్నది. కలకత్తా హైకోర్టు నిర్ణయంపై కేంద్రం పిటిషన్ మేరకు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ కీలక తీర్పును వెలువరించింది. పాత తేదీల నుంచి అమలు చేయడం వల్ల పన్ను విభాగం పెద్దఎత్తున నోటీసులు పంపింది. దాంతో అనేకమంది వ్యక్తులు, సంస్థలు ఇబ్బందుల పాలు కావడాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రం ఈ పిటిషన్ దాఖలు చేసింది.