న్యూఢిల్లీ, మే 14 : ప్రజాస్వామ్యం సంగతేంటని గురువారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సీబీఐ డైరెక్టర్ను ఎంపిక చేసే కమిటీలో సభ్యుడిగా భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) ఉన్నారని, అయితే ఎన్నికల ఉన్నతాధికారిని ఎంపిక చేసే ప్యానెల్లో ఆయన లేరని సుప్రీంకోర్టు ఎత్తిచూపింది. ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ల నియామక ప్రక్రియకు సంబంధించిన వ్యవహారంపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. నాకు ఓ సందేహం వచ్చింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం సీబీఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో సీజేఐ కూడా ఉన్నారని మనం చెప్పవచ్చు. లేదా దాన్ని చట్టబద్ధమైన పాలన వరకు కూడా విస్తరించవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి సీజేఐ లేరా? స్వచ్ఛమైన ఎన్నికలు జరిగేలా చూడటానికి సీజేఐ లేరా? అని విచారణ సందర్భంగా జస్టిస్ దీపాంకర్ దత్తా వ్యాఖ్యానించారు. సీజేఐ ఉండాలని మేము చెప్పడం లేదు. కానీ ఒక స్వతంత్ర సభ్యుడు ఎందుకు ఉండకూడదు? మత్రివర్గం నుంచే ఎందుకు ఉండాలి? ఒక విషయం స్పష్టం చేద్దాం. ఈ రోజు ప్రధానమంత్రి ఒకరిని ఎంపిక చేస్తారు.
ప్రతిపక్ష నాయకుడు (ఎల్వొపీ) మరొకరిని ఎంపిక చేస్తారు. అభిప్రాయ భేదం ఉంది. మరి అలాంటప్పుడు క్యాబినెట్ సభ్యుడిగా ఉన్న మూడవ సభ్యుడు ప్రతిపక్ష నాయకుడికి మద్దతు ఇస్తారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి దీనికి సమాధానమిస్తూ ఆచరణలో అది పూర్తిగా నిజం కాకపోవచ్చు. నేను దారి గురించి మళ్లీ ఆలోచించదలచుకోలేదు అని అటార్నీ జనరల్ అన్నారు. అలాగైతే అంతా నియంత్రిస్తున్నది కార్యనిర్వాహక వర్గమే అని జస్టిస్ దత్తా ఎదురుదాడి చేశారు. ఇటువంటి నియామకాలపై నిర్ణయం వాస్తవానికి 2:1 మెజారిటీతో ఆమోదించవలసి ఉంటుందని, క్యాబినెట్ మంత్రి ప్రధానమంత్రి వైఖరితో విభేదించే అవకాశం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ప్రాథమికంగా మమ్మల్ని కలవరపరిచే విషయం ఏమిటంటే కార్యనిర్వాహక వీటో ఎందుకు ఉంది? ఇది పాత తీర్పులు ఉన్నప్పటికీ ఈ కేసుల గురించి పార్లమెంట్కు తెలియదా? చట్టాలను రూపొందించే అవకాశం పార్లమెంట్కు ఉంది. కానీ సుప్రీంకోర్టే అంతిమ నిర్ణేత. మీకు నచ్చినా, నచ్చకపోయినా చట్టాలపై వ్యాఖ్యానించే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది జస్టిస్ దత్తా స్పష్టం చేశారు.
కేరళలోని శబరిమల ఆలయం సహా దేశంలోని పలు మతపరమైన ప్రదేశాలలో మహిళల పట్ల వివక్ష, బహుళ మతాలు ఆచరించే మత స్వేచ్ఛ పరిధి, విస్తృతిపై దాఖలైన పలు పిటిషన్లకు సంబంధించిన కేసులో తీర్పును తొమ్మిది మంది సభ్యుల సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం గురువారం రిజర్వ్ చేసింది. చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని ఈ ధర్మాసనం 16 రోజుల పాటు ఈ కేసు వాదనలు ఆలకించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, సీనియర్ న్యాయవాదులు సీఎస్ వైద్యనాథన్, అభిషేక్ సింఘ్వీ, ముకుల్ రోహత్గీ, ఇందిరా జైసింగ్, నీరజ్ కృష్ణ కౌల్, గోపాల్ శంకరనారాయణ తదితరులు ఈ కేసులో తమ వాదనలు వినిపించారు. రుతుస్రావ వయసున్న మహిళల ఆలయ ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని కేంద్రం సమర్థిస్తూ, దానికి వ్యతిరేకంగా ఇచ్చిన తీర్పును రద్దు చేయాలని కోరుతూ సుప్రీంకు ఒక రాతపూర్వక విజ్ఞప్తిని సమర్పించింది. ఈ అంశం పూర్తిగా మత విశ్వాసం, మతపరమైన స్వయంప్రతిపత్తి పరిధిలోకి వస్తుందని, ఇది న్యాయ సమీక్ష పరిధికి వెలుపల ఉందని పేర్కొన్నది.