న్యూఢిల్లీ: ఎన్నికల సందర్భంగా బ్యాలట్ పత్రాలు, ఈవీఎంలలో మార్పులు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘానికి సూచనలు చేయాలంటూ దాఖలైన పిటిషన్ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. బ్యాలట్ పేపర్లు, ఈవీఎంలలో పార్టీ గుర్తులకు బదులుగా అభ్యర్థి పేరు, వయసు, విద్యార్హతలు, ఫొటో ఉంటే బాగుంటుందని, ఆ మేరకు మార్పులు చేసేలా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు.
కానీ ఆ పిటిషన్ను పరిగణలోకి తీసుకునేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. పార్టీల పేర్లతో కాకుండా అభ్యర్థులు తమ సొంత అర్హతలతో పోటీ చేసేలా ఎన్నికల వ్యవస్థను మార్చాలనే ఉద్దేశంతో పిటిషనర్ ఈ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, పిటిషనర్ కోరిన మార్పులు చేయడానికి సాంకేతికంగానే కాకుండా పలు రకాలుగా అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉండటంతో కోర్టు ఆ పిటిషన్ను తిరస్కరించింది.