న్యూఢిల్లీ, ఏప్రిల్ 18: లఖింపూర్ ఖీరీ రైతుల హత్య కేసులో కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాకు అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన బెయిల్ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. వారంలోగా నిందితుడు లొంగిపోవాలని ఆదేశించింది. ఈ మేరకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమాకోహ్లీతో కూడిన ప్రత్యేక త్రిసభ్య ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. నిందితుడు ఆశిష్కు అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 10న బెయిల్ మంజూరు చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బాధిత రైతు కుటుంబాలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విచారణ సందర్భంగా అత్యున్నత ధర్మాసనం హైకోర్టు బెయిల్ తీర్పుపై పలు ప్రశ్నలను లేవనెత్తింది.
కేసు విచారణ ప్రారంభంకాక ముందే పోస్ట్మార్టం, గాయాలకు సంబంధించిన వివరాలను హైకోర్టు ప్రస్తావించడంపై అసహనం వ్యక్తం చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పు అసంబద్ధంగా ఉన్నదని పేర్కొంది. ఆశిష్ బెయిల్ అంశంపై అలహాబాద్ హైకోర్టు మరోసారి విచారణ జరుపాలని సూచించింది. నిందితుడికి గతంలో బెయిల్ను మంజూరు చేసిన జడ్జి కాకుండా ప్రధాన న్యాయమూర్తి ఈ పిటిషన్ను విచారించాలని సలహానిచ్చింది. హైకోర్టు మంజూరుచేసిన బెయిల్ను సవాల్ చేస్తూ అప్పీల్కు వెళ్లాలంటూ సిట్ సూచించినప్పటికీ, యూపీ ప్రభుత్వం ఆ పని చేయకపోవడంపై ధర్మాసనం ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. సాగు చట్టాలకు వ్యతిరేకంగా గత ఏడాది అక్టోబర్ 3న శాంతియుత నిరసనలు చేపడుతున్న రైతుల మీద నుంచి ఆశిష్ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు రైతులు మరణించగా, అనంతరం జరిగిన హింసాత్మక ఘర్షణల్లో మరో నలుగురు మృతిచెందారు.
న్యాయవ్యవస్థపై మళ్లీ విశ్వాసం: ఎస్కేఎం
లఖింపూర్ కేసులో ఆశిష్ మిశ్రాకు బెయిల్ రద్దు చేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) స్వాగతించింది. కోర్టు తీర్పు దేశంలోని న్యాయవ్యవస్థపై విశ్వాసాన్ని పునరుద్ధరించేలా ఉన్నదని పేర్కొన్నది. కోర్టు ఉత్తర్వులతో రైతులకు న్యాయం జరుగుతుందన్న ఆశ కలుగుతున్నదని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. బాధిత రైతు కుటుంబాలకు పరిహారంతో పాటు రక్షణ కల్పించాలని యూపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు, అజయ్ మిశ్రాను కేంద్రమంత్రి పదవి నుంచి ఎప్పుడు తొలగిస్తారని ప్రధాని మోదీని కాంగ్రెస్ ప్రశ్నించింది.
బీజేపీ ఎమ్మెల్యే కారు కింద పడి
లఖింపూర్లో మరో బీజేపీ నాయకుడి కారు బీభత్సం సృష్టించింది. వేగంగా దూసుకొచ్చిన కారు ఓ బైక్ను ఢీకొట్టడంతో అన్నదమ్ముళ్లు రవి, విక్రమ్ ఘటనా స్థలంలోనే మృతిచెందారు. ఈ కారు బీజేపీ ఎమ్మెల్యే యోగేశ్ వర్మకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన సమయంలో ఎమ్మెల్యే కారులో లేరని పేర్కొన్నారు. డ్రైవర్తో పాటు కారును అదుపులోకి తీసుకొన్నట్టు వెల్లడించారు.