వారణాసి కోర్టుకు సుప్రీం ఆదేశం.. ‘జ్ఞాన్వాపీ’పై నేడు విచారణ
న్యూఢిల్లీ, మే 19: జ్ఞాన్వాపీ మసీదు కేసు విచారణను తాత్కాలికంగా నిలిపివేయాలని సుప్రీం కోర్టు గురువారం వారణాసి సివిల్ కోర్టును ఆదేశించింది. ఈ అంశంపై శుక్రవారం తామే విచారిస్తామని తెలిపింది. మసీదులోని వజూఖానా చుట్టూ ఉన్న గోడను కూల్చివేసేలా ఆదేశాలివ్వాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది.
దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం గురువారం విచారించాల్సి ఉండగా.. హిందువుల తరఫు సీనియర్ న్యాయవాది హరిశంకర్ జైన్ కోర్టుకు హాజరు కాలేదు. ఇటీవల అనారోగ్యంతో దవాఖానలో చేరిన ఆయన బుధవారమే డిశ్చార్జి అయ్యారు. విచారణకు హాజరు కాలేకపోయారు. ఈ నేపథ్యంలో కోర్టు విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. ఇదిలా ఉండగా, జ్ఞాన్వాపీ వీడియో సర్వే రిపోర్టును కమిషన్ వారణాసి కోర్టుకు అందజేసింది. జ్ఞాన్వాపీలో వీడియో సర్వే కోసం కోర్టు ప్రత్యేకంగా కమిషన్ను నియమించిన సంగతి తెలిసిందే.