సమీక్ష పూర్తయ్యే వరకు కేసులు ఆపేస్తారా?: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, మే 10: రాజద్రోహం చట్టాన్ని పునఃపరిశీలించి నిర్ణయం తీసుకొనేంతవరకు ఆ చట్టం కింద కేసుల నమోదును నిలిపివేస్తారా..? అని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇప్పటికే నమోదు చేసిన కేసులపై ఏం నిర్ణయం తీసుకొంటారని అడిగింది. దీనిపై బుధవారం సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఐపీసీ 124ఏ(రాజద్రోహం)ను పునఃసమీక్ష చేస్తామని కేంద్రప్రభుత్వం సోమవారం సుప్రీం కోర్టుకు అఫిడవిట్ సమర్పించిన సంగతి తెలిసిందే.
ఈ అఫిడవిట్ను పరిశీలించిన కోర్టు.. పునఃసమీక్ష చేయడంపై కేంద్రానికి అనుమతినిచ్చింది. అయితే, దీనికి ఎంతకాలం పడుతుందని ప్రశ్నించింది. ప్రభుత్వంతో సంప్రదించి కచ్చితమైన సమయం తెలియజేస్తానని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గడువు కోరగా విచారణను బుధవారానికి వాయిదా వేసింది. 2015-2020 మధ్య కాలంలో దేశంలో 356 రాజద్రోహం కేసులు నమోదయ్యాయి. ఈ చట్టం కింద 548 మందిని అరెస్టు చేశారు.