న్యూఢిల్లీ, నవంబర్ 12: ఉత్తరప్రదేశ్ హైకోర్టు కాకుండా వేరే హైకోర్టుల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన జడ్జి పర్యవేక్షణలో లఖింపూర్ కేసును దర్యాప్తు చేసే అంశంపై స్పందన తెలియజేయడానికి సుప్రీం కోర్టు, యూపీ ప్రభుత్వానికి సోమవారం (ఈ నెల 15) దాకా గడువునిచ్చింది. లఖింపూర్ కేసులో సిట్ దర్యాప్తు తీరుపై సుప్రీం కోర్టు ఈ నెల 8న విచారణ సందర్భంగా తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. వేరే హైకోర్టు మాజీ జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు జరిపేలా ఆదేశిస్తామని యూపీ సర్కారుకు సూచించింది. దీనిపై నిర్ణయం తీసుకొనేందుకు సోమవారం దాకా గడువు ఇవ్వాలని ఆ రాష్ట్రం తరఫు అడ్వొకేటు హరీశ్ సాల్వే కోరడంతో సుప్రీం కోర్టు అందుకు అంగీకరించింది.