న్యూఢిల్లీ, ఏప్రిల్ 2: ఎన్నికల బాండ్ల విక్రయాలకు సంబంధించి ‘ఎస్వోపీ’ (స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్) ప్రక్రియను బయటపెట్టేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాకరించింది. బాండ్ల విక్రయాలు, ఎన్క్యాష్ నిమిత్తం దేశవ్యాప్తంగా అధీకృత బ్యాంక్ శాఖలకు జారీ చేసిన ఎస్వోపీ.. అన్నది సంస్థ ‘వాణిజ్య రహస్యం’ కిందకు వస్తుందని, దీనిని వెల్లడించలేమని ఆర్టీఐ దరఖాస్తుకు ఎస్బీఐ సమాధానమిచ్చింది.
సంస్థకు చెందిన మేధోపరమైన, వాణిజ్య రహస్యాలకు ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 8(1)(డీ) కింద మినహాయింపు ఉందని ఎస్బీఐ పేర్కొన్నది. కాగా ఎస్బీఐ సమాధానంపై ఆర్టీఐ కార్యకర్త అంజలీ భరద్వాజ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఎలక్టోరల్ బాండ్ల పథకం చట్ట విరుద్ధమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత కూడా, ఇందుకు సంబంధించి మొత్తం వివరాల్ని ఎస్బీఐ వెల్లడించకపోవటం నన్ను షాక్కు గురిచేసింది. బాండ్ల పథకానికి సంబంధించి అత్యంత కీలక సమాచారాన్ని బయటపెట్టడానికి ఎస్బీఐ నిరాకరిస్తూ వస్తున్నది’ అని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.