న్యూఢిల్లీ : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో 12వేల కొత్త ఉద్యోగులను నియమించుకోవాలని చూస్తున్నట్టు చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలోపే ఈ నియామకాలు జరుగుతాయని శెట్టి వెల్లడించారు. తమ శాఖలో 250 కొత్త బ్రాంచులను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. క్లరికల్, ఆఫీసర్ కేడర్లలో కలిపి ఈ నియామకాలు ఉండే అవకాశం ఉందన్నారు. రిటైర్మెంట్లు, ఉద్యోగుల అవసరాలను బట్టి కొద్దిగా మార్పులు ఉండవచ్చన్నారు.
గతేడాది తాము పెద్ద ఎత్తున ఉద్యోగులను నియమించుకున్నామని.. ఎందుకంటే స్పెషలిస్ట్ ఐటీ అధికారులను 1,500 మందిని తీసుకున్నట్టు సీఎస్ శెట్టి చెప్పారు. ఈ ఏడాది ఐటీ విభాగంలో అంత ఎక్కువ మంది అవసరం లేదన్నారు. ఇప్పటికే అనేక బ్రాంచ్లు ఉన్నప్పటికీ.. కొత్తగా పెరుగుతున్న కాలనీలు, వాణిజ్య ప్రాంతాల్లో సంస్థను మరింత విస్తరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రతి ఏడాది 200 నుంచి 250 కొత్త శాఖలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. 2026 నాటికి 2.45 లక్షల మందితో దేశంలోనే అతిపెద్ద నియామక సంస్థగా ఉందన్నారు.