సుమంత్, ఐశ్వర్యరాజేష్ జంటగా నటిస్తున్న స్పిరిచ్యుయల్ మిస్టరీ థ్రిల్లర్ ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్ జాగర్లపూడి దర్శకుడు. కలిపు మధు, లక్ష్మణ్ నిర్మిస్తున్నారు. ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకురానుంది. ఆదివారం హైదరాబాద్లో ప్రీరిలీజ్ ఈవెంట్ను నిర్వహించారు. ఈ వేడుకకు అక్కినేని అఖిల్, సిద్ధు జొన్నలగడ్డ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అఖిల్ అక్కినేని మాట్లాడుతూ ‘ఇటీవలకాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ దక్కుతున్నది. ఇది ఆ తరహా చిత్రమే అనిపిస్తున్నది. నాకు చిన్నతనం నుంచే సుమంత్ అన్నతో గొప్ప అనుబంధం ఉంది. ఏం కావాలన్నా కాదనకుండా తెచ్చి పెట్టేవాడు.
అందుకే నాకు ఆయన స్పెషల్ బ్రదర్. ఇక ట్రైలర్ చూస్తుంటే దర్శకుడు ఈ సినిమా కోసం ప్రాణం పెట్టాడనిపించింది. దైవిక అంశాలు గొప్ప కంటెంట్తో సినిమా చేయడం నిజంగా గ్రేట్. ఈ సినిమా పెద్ద హిట్ కాబోతున్నదని నా అంతరాత్మ చెబుతున్నది’ అన్నారు. సుమంత్ తన కెరీర్లో విభిన్నమైన కథల్ని ఎంచుకొని సినిమాలు చేస్తున్నారని సిద్ధు జొన్నలగడ్డ అన్నారు. సుమంత్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ప్రయాణం మూడేళ్ల క్రితం మొదలైంది. గొప్ప స్థాయిలో చేద్దామనుకున్నాం. దేవీకృప వల్ల అన్నీ అనుకున్నట్లుగా సాగి అద్భుత చిత్రంగా రూపుదిద్దుకుంది. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఏదో దైవిక శక్తి మమ్మల్ని నడిపించిందనే నమ్మకం కలిగింది. సిద్ధు పాత్ర ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటుంది’ అన్నారు. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిపంచే చిత్రమిదని దర్శకుడు పేర్కొన్నారు.