న్యూఢిల్లీ, ఏప్రిల్ 15: ప్రధాని మోదీ ప్రభుత్వ అసమర్థత వల్లే 2019లో పుల్వామా దాడి జరిగిందని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టించాయి. విపక్షాలు, హక్కుల నేతలు, సామాజిక కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందడానికి సైనికులను బలితీసుకున్నారంటూ మోదీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సత్యపాల్ ఇంటర్వ్యూను ట్వీట్ చేసిన కాంగ్రెస్ నేత రాహుల్.. 2019 ఎన్నికల్లో తన వైఫల్యం బయటపడకుండా మోదీ ‘పుల్వామా’ను అణచివేశారని ఆరోపించారు. సత్యపాల్ వ్యాఖ్యలతో యావత్తు దేశం షాక్కు గురైందని కాంగ్రెస్ తెలిపింది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పందిస్తూ మోదీకి అవినీతి అసలు సమస్యే కాదని, రాజ్యాంగ పదవుల్లో పనిచేసిన మాలిక్ లాంటి వారు చేసిన ఆరోపణలు చూస్తే అవినీతి నిర్మూలన అన్నది మోదీ ప్రభుత్వానికి ప్రాధాన్యం కాదని అర్థమవుతున్నదని వెల్లడించారు.
పుల్వామా దాడి ఎన్నికల ముందే ఎందుకు జరిగిందో అందరికీ అర్థమయ్యిందని ఆర్జేడీ నేత మనోజ్ కుమార్ వ్యాఖ్యానించారు. శివసేన (ఉద్ధవ్ వర్గం) ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ నిప్పులాంటి నిజాన్ని మాలిక్ బయటపెట్టారని అన్నారు. ఇది పుల్వామాలో జరిగిన పేలుడు కన్నా పెద్ద విస్ఫోటమని అన్నారు. రాజకీయ లబ్ధి కోసమే ఈ ఉగ్ర దాడిని జరిపించారా? మీరు ఎన్నికల్లో గెలిచి లబ్ధి పొందడానికి 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు. కాగా, మోదీ ప్రభుత్వంపై మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ చేసిన ఆరోపణలపై ఇంతవరకు బీజేపే మంత్రులు కానీ, నేతలు కానీ స్పందించకపోవటం గమనార్హం.