న్యూఢిల్లీ: జమ్ముకశ్మీర్ సహా పలు రాష్ర్టాలకు గవర్నర్గా వ్యవహరించిన సత్యపాల్ మాలిక్, ఆయన మద్దతుదారులు శనివారం ఢిల్లీలో పోలీసు స్టేషన్ ఎదుట ధర్నా చేశారు. తమ సభకు అనుమతి ఇవ్వకపోవడం పట్ల వారు మండిపడ్డారు. పుల్వామా ఉగ్రదాడికి సంబంధించి ఇటీవల నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సత్యపాల్ మాలిక్ ఆరోపణలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి ఈ నెల 28న విచారణకు రావాలంటూ సీబీఐ ఆయనకు శుక్రవారం సమన్లు జారీ చేసింది.
ఈ నేపథ్యంలో శనివారం ఆయన ఢిల్లీలోని ఆర్కేపురం పోలీస్ స్టేషన్కు వచ్చి ధర్నా చేయడంతో ఆయనను అరెస్ట్ చేశారంటూ మీడియాలో ప్రచారం జరిగింది. వాస్తవానికి సత్యపాల్ మాలిక్తో ఆయన ఇంటిలో భేటీ అయ్యేందుకు యూపీ, హర్యానాకు చెందిన పలు రైతు సంఘాల నేతలు, గ్రామ కమిటీల నాయకులు వచ్చారు. అయితే ఊహించిన దానికన్నా అధికంగా నేతలు రావడంతో వారి భోజన ఏర్పాట్లకు స్థలం చాలక దగ్గరలోని పార్కులోకి చేరారు. అక్కడే సమావేశం జరపాలని నిర్ణయించారు. దీనికి పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ముందస్తు అనుమతి లేకుండా నివాస ప్రాంతాలలో ఎలాంటి సమావేశాలు జరపరాదని అడ్డుకున్నారు. దీనిపై ఆగ్రహించిన సత్యపాల్ మాలిక్ రైతు నేతలు, ఇతర మద్దతుదారులతో పోలీస్ స్టేషన్కు చేరుకొని ధర్నా చేశారు.