చెన్నై, అక్టోబర్ 18: అన్నాడీఎంకే మాజీ అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతిపై ఆమె సన్నిహితురాలు శశికళను విచారించాలని ఆర్ముగస్వామి కమిటీ తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. చెన్నై అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ 2016 డిసెంబర్ 5వ తేదీన జయలలిత మరణించినట్టు దవాఖాన వర్గాలు ప్రకటించాయి. కానీ, తాము విచారించిన సాక్షులు చెప్పిన వివరాలను బట్టి డిసెంబర్ 4వ తేదీ మధ్యాహ్నమే జయలలిత మరణించారని తెలిసినట్టు తమిళనాడు ప్రభుత్వానికి సమర్పించిన 475 పేజీల నివేదికలో కమిటీ పేర్కొన్నది.
జయ మృతి విషయంలో శశికళతోపాటు ఆమె బంధువైన వైద్యుడు కేఎస్ శివకుమార్, నాటి తమిళనాడు ఆరోగ్యశాఖ కార్యదర్శి జే రాధాకృష్ణన్, ఆరోగ్యశాఖ మంత్రి సీ విజయభాస్కర్ను కూడా విచారించాలని సూచించింది. అప్పటి తమిళనాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామమోహన్రావు, మరో ఇద్దరు వైద్యుల చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని, వారిపై కూడా విచారణ జరుపాలని కోరింది. ఈ నివేదికను అధ్యయనం చేస్తున్నామని, న్యాయ నిపుణుల అభిప్రాయం తీసుకొని తదుపరి చర్యలు తీసుకొంటామని తమిళనాడు ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది.