న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీ మేథోమధన సదస్సుగా ఇటీవల నిర్వహించిన చింతన్ శిబిరంపై ఆ పార్టీ సీనియర్ నేత శశి థరూర్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీ సంస్కరణ, ప్రక్షాళన, పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా చింతన శిబిరం జరిగిందని, ఈ ప్రక్రియ పార్టీలో పలువురు నేతలు కోరుకున్న విధంగా ఫలితాలు ఇస్తుందా అనేది చూడాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
రాజస్ధాన్లోని ఉదయ్పూర్లో మూడు రోజుల పాటు జరిగిన చింతన్ శిబిరం గురించి మాట్లాడుతూ పార్టీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు నేతల భిన్నాభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాలని, సంప్రదింపుల ప్రక్రియ విస్తారంగా జరగాలని సంస్కరణవాదులు కోరుతున్నారని చెప్పారు.
ప్రతిపాదిత సలహా మండలిలో ఇలాంటి సమాలోచనలు సాగితే చింతన్ శిబిరంలో ఆశించిన ఫలితాలు చేకూరినట్టేనని వ్యాఖ్యానించారు. ఆ దిశగా కసరత్తు జరిగి ఆశించిన ఫలితాలు వస్తాయా అనేది వేచిచూడాలని ఓ వార్తాసంస్ధకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నారు. కాగా, కాంగ్రెస్ పార్టీలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని కోరుతూ పార్టీ చీఫ్ సోనియా గాంధీకి 2020లో లేఖరాసిన జీ23 నేతల్లో శశి థరూర్ ఒకరు.