శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తాజాగా ఒక గ్రామ సర్పంచ్పై కాల్పులు జరిపి చంపారు. బారాముల్లా జిల్లాలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. పట్టన్ నగరంలోని గోష్బుగ్ ప్రాంతంలో స్వతంత్ర సర్పంచ్ మంజూర్ అహ్మద్ బాంగ్రూపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. తీవ్ర బుల్లెట్ గాయాలైన ఆయనను ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించినట్లు జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలిసిన వెంటనే భద్రతా దళాలు ఆ ప్రాంతానికి చేరాయి. ఉగ్రవాదుల కోసం సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. కాగా, ఉగ్రవాదులు ఇటీవల పౌరులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. స్థానికేతరులు, కశ్మీర్ పండిట్లతోపాటు ముస్లిం ప్రజలపై కూడా కాల్పులు జరుపుతున్నారు.
మరోవైపు జమ్ముకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య కాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. షోపియాన్ జిల్లా జైనాపోరా ప్రాంతంలోని బడిగ్రామ్లో ఉగ్రవాదులు సంచరిస్తున్నారని సమాచారం అందుకున్న భద్రతా బలగాలు కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ తరుణంలో ఉగ్రవాదులు కాల్పులకు దిగడంతో బలగాలు ప్రతిగా కాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.