న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రో స్టేషన్లో (Delhi Metro) విషాదం చోటుచేసుకున్నది. కదులుతున్న రైలు కింద పడి మహిళ మృతి చెందింది. రీనా (Reena) అనే మహిళ ఇందర్లోక్ మెట్రో స్టేషన్లో (Inderlok Station) రైలు దిగుతున్నది. ఈ క్రమంలో ఆమె చీర (Sari) డోర్ల మధ్య ఇరుక్కుపోయింది. రైలు కదలడంతో ఆమె కిందపడిపోయింది. దీంతో తలకు, ఛాతీకీ తీవ్రగాయాలయ్యాయి. మెట్రో సిబ్బంది ఆమెను హుటాహుటిన సఫ్దర్జంగ్ దవాఖానకు (Safdarjung Hospital) తరలించారు. అయితే చికిత్స పొందుతూ రీనా మృతిచెందింది.
సీసీటీవీ ఫుటేజీని పరిశీలించిన అధికారులు.. వెస్ట్ ఢిల్లీలోని నాంగ్లోయ్ నుంచి మోహన్ నగర్కు వెళ్తున్న మెట్రో రైలులో రీనా ఎక్కింది. అయితే కొద్దిసేపట్లోనే తన కూతురు కోసం రైలు దిగుతుండగా ఆమె చీర డోర్లలో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. ఈ ఘటనపై దర్యాప్తుచేస్తున్నామని రైల్వే అధికారులు తెలిపారు. కాగా, రీనా భర్త ఏడేండ్ల క్రితమే చనిపోయారని, ఆమెకు కుమారుడు, కుమార్తె ఉన్నారు.