SVP Stadium | 60 ఏండ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన స్టేడియం అది. భారత్లో తొలి వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్ అక్కడే జరిగింది.20వ శతాబ్దపు అద్భుత నిర్మాణంగా ప్రపంచ కట్టడాల సంస్థ గుర్తించింది. అలాంటి చరిత్ర ఉన్న ఆ స్టేడియం మరికొద్ది రోజుల్లో కాలగర్భంలో కలిసిపోనున్నది. కారణం.. ప్రధాని నరేంద్రమోదీ పేరిట పునర్నిర్మించిన గుజరాత్లోని మరో స్టేడియమే!
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ (ఎస్వీపీ) స్టేడియం కాలగర్భంలో కలిసిపోనున్నది. అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ త్వరలో ఈ స్టేడియాన్ని నేలమట్టం చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘అహ్మదాబాద్ మిర్రర్’ పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది. క్రికెట్ మ్యాచ్ల నిర్వహణకు మాత్రమే కాకుండా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు కూడా ఈ స్టేడియం పనికిరాకుండా పోయిందని, అందుకే, కూల్చడమే మంచిదన్న నిర్ణయానికి వచ్చినట్టు ఏఎంసీకి చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. స్టేడియాన్ని కూల్చకుండా మరమ్మతులు చేయాలనుకొన్నప్పటికీ, రూ.60 కోట్ల వరకు వెచ్చించాల్సి వస్తుందని, దానికి బదులు దీన్ని పడగొట్టి, కొత్త నిర్మాణాన్ని చేపట్టినా.. ఖర్చు తక్కువే అవుతుందని పేర్కొన్నారు. అయితే, ఏఎంసీ నిర్ణయంపై అమెరికాకు చెందిన వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ (ప్రపంచ కట్టడాల సంస్థ-డబ్ల్యూఎంఎఫ్) ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత స్వాతంత్య్రానంతరం ప్రగతిశీల భావాలకు, ప్రయోగాలకు కొత్త స్ఫూర్తినిచ్చేలా నిలిచిన ఎస్వీపీని కూల్చేయడం తగదని పేర్కొంది. 20వ శతాబ్దపు అద్భుత నిర్మాణంగా నిలిచిన ఈ కట్టడం.. నిధుల సంక్షోభం, నిర్వహణలేమి కారణంగానే ఈ దుస్థితికి చేరిందని దుయ్యబట్టింది. మరమ్మతులు చేయించి, స్టేడియానికి పూర్వవైభవం తీసుకురావాలని సూచించింది.
కారణం అదేనా?!
1960లో ఎస్వీపీని నిర్మించారు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణే లక్ష్యంగా దీన్ని తీసుకొచ్చారు. 1981లో భారత్లో తొలిసారిగా జరిగిన వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్కు ఈ స్టేడియమే ఆతిథ్యం ఇచ్చింది. 1982లో అహ్మదాబాద్లో మోతెరా స్టేడియాన్ని నిర్మించారు. అప్పటినుంచి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు ఇక్కడే నిర్వహిస్తుండగా.. ఎస్వీపీలో జాతీయస్థాయి మ్యాచ్లు జరుగుతుండేవి. అనంతర కాలంలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఈవెంట్ల నిర్వహణకే ఎస్వీపీని పరిమితం చేశారు. కాగా, 2020లో రూ. 800 కోట్లకు పైగా నిధులను వెచ్చించి మోతెరా స్టేడియాన్ని పునర్నిర్మించారు. దానికి ప్రధాని మోదీ పెట్టారు. అయితే పటేల్ పేరిట ఎంతో చారిత్రాత్మక ప్రాధాన్యం ఉన్న స్టేడియాన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వచ్చాయి. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన ఎస్వీపీలో తిరిగి క్రికెట్ మ్యాచ్లను పునఃప్రారంభించాలని పలువురు డిమాండ్ చేశారు. ఎస్వీపీలో తిరిగి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల ప్రారంభం జరిగితే, మోదీ స్టేడియం ప్రభ తగ్గవచ్చన్న అనుమానంతోనే సదరు స్టేడియాన్ని కూల్చేయడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని నెటిజన్లు సోషల్ మీడియాలో మండిపడుతున్నారు.
పటేల్ పేరు లేకుండా మార్పు..
1960లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ల నిర్వహణ కోసమని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియాన్ని నిర్మించారు. అయితే, 1982లో గుజరాత్ స్టేడియం పేరిట మరో నిర్మాణాన్ని మోతెరా ప్రాంతంలో చేపట్టి అందులోనే అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్లు నిర్వహించడం ప్రారంభించారు. అయితే, మోతెరాలోని సర్దాయ్ వల్లభాయ్ పటేల్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో నిర్మించిన ఈ క్రీడాస్థలిని గుజరాత్ స్టేడియంగా కాకుండా ‘సర్దార్ పటేల్ స్టేడియం’గా పిలవాలని పలువురు డిమాండ్ చేశారు. దీనికి మోతెరాలో నిర్మించినందుకు ‘మోతెరా స్టేడియం’గా కూడా పిలవొచ్చని ప్రభుత్వం పేర్కొంది. 2020లో స్టేడియాన్ని పునర్నిర్మించిన ప్రభుత్వం.. సర్దార్ పటేల్ పేరును తొలగించి నరేంద్రమోదీ స్టేడియంగా నామకరణం చేసింది.