Sanjay Singh : మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన ఆప్ ఎంపీ సంజయ్ సింగ్కు సర్వోన్నత న్యాయస్ధానం భారీ ఊరట కల్పించింది. సంజయ్ సింగ్కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్ట్ ఆయన స్వేచ్ఛగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనవచ్చని స్పష్టం చేసింది. ఇక తన కుమారుడికి కోర్టు బెయిల్ మంజూరు చేయడంపై సింగ్ తల్లి రాధికా సింగ్ స్పందించారు.
కోర్టు నిర్ణయంతో తాము సంతోషంగా ఉన్నామని, దీని కోసం తాము ఎప్పటినుంచో వేచిచూస్తున్నామని చెప్పారు. సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, తన కుమారుడు అమాయకుడని, ఆయనను అరెస్ట్ చేయకూడదని, అయినా తనకు బెయిల్ రావడంతో తాము సంతోషంగా ఉన్నామని పేర్కొంది. ఇక సంజయ్ సింగ్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడాన్ని ఆప్ స్వాగతించింది.
ఈరోజు దేవుడు తమవైపు ఉన్నాడని, భజరంగ్ బళి తమవైపు ఉన్నారని, సత్యం గెలిచిందని ఆప్ జాతీయ ప్రతినిధి ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు. తాము మొదటి నుంచి ఇదే చెబుతున్నామని, ఈ కేసు మొత్తం బూటకమని, బీజేపీ కార్యాలయంలో ఈ కేసుపై కట్టుకధ అల్లారని ఆమె అన్నారు. మరో 500 సార్లు దాడులు చేసినా ఒక్క పైసా కూడా స్వాధీనం చేసుకోలేరని స్పష్టం చేశారు. విచారణలో డబ్బు పట్టుబడనప్పుడు ఆయనను ఎందుకు కస్టడీలో ఉంచాలని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించిందని ప్రియాంక కక్కర్ పేర్కొన్నారు.
Read More :