మహారాష్ట్ర బీజేపీ నేతల వ్యవహార శైలిపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కొంత మంది నేతలు తామేదో పైనుంచి దిగొచ్చినట్లు ఫీల్ అవుతారని ఫైర్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అగ్రనేత దేవేంద్ర ఫడ్నవీస్కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ విషయంలో విచారణ నిమిత్తమై తమ ముందు హాజరు కావాలని ఆదేశించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ రౌత్ బీజేపీ నేతలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.
‘చట్టానికి తామేదో అతీతులని కొందరు, కొన్ని పార్టీల నేతలు భావిస్తుంటారు. అలా ఎందుకు భావిస్తారో అర్థం కావడం లేదు. మహారాష్ట్ర మంత్రులకు, ప్రజా ప్రతినిధులకు కేంద్ర దర్యాప్తు సంస్థలు సమన్లు జారీ చేశాయి. ఇది రాజకీయ ప్రతీకారంలో భాగమే. అయినా వాళ్లు దర్యాప్తు సంస్థల ముందు హాజరయ్యారు. ప్రజాస్వామ్యంలో ఎవరూ స్పెషల్ కాదు. చట్టం ముందు అందరూ సమానులే. మరి డ్రామాలెందుకు?’ అంటూ రౌత్ తీవ్రంగా విరుచుకుపడ్డారు.