లౌడ్స్పీకర్లపై నిషేధం విధించాలన్న డిమాండ్ మహారాష్ట్రలో ఇంకా నడుస్తూనే వుంది. ఇదే విషయంపై మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన రాజ్ థాకరేకు, ప్రభుత్వానికి మధ్య రోజూ మాటల యుద్ధం జరుగుతూనే వుంది. తాజాగా రాజ్థాకరే డిమాండ్పై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలే చేశారు. నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరేని ఒవైసీతోఎ పోలుస్తూ విమర్శలకు దిగారు. తానెవ్వరి పేరునూ తీసుకోవడం లేదంటూనే పరోక్షంగా రాజ్థాకరేని విమర్శించారు.
యూపీ ఎన్నికల సందర్భంగా ఒవైసీ విషయంలో బీజేపీ ఏమైతే చేసిందో… అచ్చు మహారాష్ట్రలో కొంత హిందూ ఒవైసీ కోసం అదే చేస్తోందంటూ రౌత్ విరుచుకుపడ్డారు. మహారాష్ట్రలోని పరిస్థితులను చెడగొట్టాలని కొందరు ప్రయత్నాలు చేశారని, అయితే ఇక్కడి ప్రజలు, పోలీసులు చాలా సంయమనంతో వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. శ్రీరాముడు, హనుమంతుడి పేర్లతో కొందరు విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని రౌత్ మండిపడ్డారు. కొత్త ఒవైసీ, హిందూ ఒవైసీ ఇలా చేస్తున్నారని, అలాంటి వాటికి తాము అవకాశమివ్వమని రౌత్ తేల్చి చెప్పారు.
సంజయ్ రౌత్కు కౌంటర్ ఇచ్చిన రాజ్ థాకరే
శివసేన ఎంపీ సంజయ్ రౌత్కు మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేన అధ్యక్షుడు రాజ్ థాకరే గట్టి కౌంటర్ ఇచ్చారు. మహారాష్ట్రలో అల్లర్లు జరగాలని తాము ఎంత మాత్రమూ కోరుకోవడం లేదని స్పష్టం చేశారు. ముస్లింలు ప్రార్థనలకు తాము వ్యతిరేకం కాదని, కానీ… వాటిని లౌడ్ స్పీకర్లలో చేస్తే… తాము కూడా లౌడ్ స్పీకర్లలోనే చేయాల్సి వస్తుందని తేల్చి చెప్పారు. చట్టం కంటే మతం పెద్దది కాదన్న విషయాన్ని ముస్లింలు మొదట గుర్తించాలని రాజ్ థాకరే స్పష్టం చేశారు.