ముంబై : అండర్వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం కార్యకలాపాలకు సంబంధించి మనీల్యాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ను ఈడీ అరెస్ట్ చేయడంపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ కాషాయ పార్టీపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జుగుప్పాకర రాజకీయాలకు తెరలేపిందని ఆయన మండిపడ్డారు. నవాబ్ మాలిక్ను మార్చి 3 వరకూ ఈడీ కస్టడీకి అప్పగించారు.
దేశంలో ఇవాళ అసహ్యకరమైన రాజకీయాలు చోటుచేసుకుంటున్నాయని, ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైతే కేంద్ర దర్యాప్తు సంస్ధలు, గవర్నర్ కార్యాలయం రంగంలోకి దిగుతున్నాయని ఆక్షేపించారు. పశ్చిమ బెంగాల్లో ఏం జరిగిందో చూశామని, దేశంలో అసలు ఎలాంటి ప్రజాస్వామ్యం నడుస్తోందని రౌత్ ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసం కేంద్ర దర్యాప్తు సంస్ధలను బీజేపీ దుర్వినియోగపరుస్తోందని అన్నారు.
బీజేపీ దిగజారుడు రాజకీయాలకు దీటుగా తాము కొన్ని రాజకీయ చర్యలు చేపడతామని చెప్పారు. ఇక నవాబ్ మాలిక్ అరెస్ట్ను మహారాష్ట్ర మంత్రి ఆదిత్య ఠాక్రే ఖండించారు. దేశంలో జరుగుతున్న జుగుప్పాకర రాజకీయాలకు వ్యతిరేకంగా మనం కలిసికట్టుగా పోరాడాలని పిలుపు ఇచ్చారు. కాగా నవాబ్ మాలిక్ను మహారాష్ట్ర క్యాబినెట్ నుంచి తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. నవాబ్ మాలిక్ విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఆదిత్య ఠాక్రే ఓ నిర్ణయం తీసుకుంటారని శివసేన నేత సంజయ్ రౌత్ పేర్కన్నారు.