Sanjay Raut | లోక్సభ ఎన్నికలకు ముందు మహారాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన పార్టీతో ఇకపై పొత్తు లేదని వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ అధినేత ప్రకాశ్ అంబేద్కర్ ప్రకటించారు. అయితే, ఈ నిర్ణయంపై యూబీటీ శివసేన నేత సంజయ్ రౌత్ స్పందించారు. ప్రకాశ్ అంబేద్కర్ నిర్ణయం ఏకపక్షమని, దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన మరోసారి పునరాలోచించాలని కోరారు.
లోక్సభ ఎన్నికల కోసం ప్రకాశ్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడి పార్టీ మహా వికాస్ అఘాడి శివనేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (శరత్ చంద్ర పవార్) పార్టీలతో కలిసి కూటమిలో చేరాలని భావించారు. అయితే, సీట్ల పంపకానికి సంబంధించి ఇప్పటి వరకు నిర్ణయం వెల్లడించలేదు. ఇప్పటి వరకు సీట్ల పంచాయితీ తేలకపోవడంతో ఆయన ఒంటరిగానే బరిలోకి దిగాలని నిర్ణయించినట్లు సమాచారం.
ఈ నెల 26న తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన వీబీఏ, మహా కూటమి మధ్య చర్చలపై స్పందించేందుకు నిరాకరించారు. పార్టీల మధ్య అంతర్గత కలహాలు అంతం కావడం లేదని పేర్కొన్నారు. ఇటీవల సైతం ఆయన కూటమిలోని పార్టీల వైఖరిపై అసంతృప్తి వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని 48 లోక్సభ స్థానాల్లో శివసేన (యూబీటీ)కి అత్యధికంగా 19, కాంగ్రెస్కి 16, ఎన్సీపీ (శరద్ పవార్)కి 9 సీట్లలో పోటీ చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.
అయితే, సాంగ్లీ, భీవండి, ముంబయి నార్త్ వెస్ట్, ముంబయి సౌత్ సెంట్రల్ లోక్సభ స్థానాలపై కాంగ్రెస్, శివసేన (యూబీటీ) డిమాండ్ చేస్తున్నాయి. ఇక మహారాష్ట్రలో లోక్సభ ఎన్నికలు ఐదువిడుతల్లో జరుగనున్నాయి. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20 తేదీల్లో ఎన్నికలు జరుగనుండగా.. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.