ముంబై : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల అనంతరం ఉద్ధవ్ ఠాక్రే నమ్మక ద్రోహానికి పాల్పడి బీజేపీని మోసగించారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై శివసేన (యూబీటీ) నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) స్పందించారు. సేన చీఫ్ ఠాక్రే అంటే బీజేపీ భయపడుతోందని వ్యాఖ్యానించారు. నాందేడ్లో శనివారం జరిగిన ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ అమిత్ షా ఉద్ధవ్ ఠాక్రే తమ పార్టీని మోసగించారని దుయ్యబట్టారు.
షా వ్యాఖ్యలను ప్రస్తావించిన సంజయ్ రౌత్ ఉద్ధవ్ ఠాక్రేను చూసి కాషాయ పార్టీ భయపడుతున్నదని అన్నారు. శివసేనలో చీలిక తెచ్చిన బీజేపీ తమ పార్టీ పేరును, చిహ్నాన్ని విద్రోహులకు కట్టబెట్టిందని, ఇంతచేసినా కాషాయ పార్టీకి ఉద్ధవ్ ఠాక్రే, అసలైన శివసేన అంటే భయం మాత్రం పోలేదని రౌత్ తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు.
నాందేడ్ ర్యాలీలో అమిత్ షా 20 నిమిషాల పాటు ప్రసంగిస్తే ఏడు నిమిషాలు ఉద్ధవ్ ఠాక్రే గురించే మాట్లాడారని గుర్తుచేశారు. అసలు బీజేపీ మహా సంపర్క్ అభియాన్లో భాగంగా ర్యాలీ నిర్వహించారా లేక ఠాక్రేను విమర్శించేందుకే అనేది తనకు అర్ధం కాలేదని అన్నారు. ఇక మహారాష్ట్ర సీఎం అయ్యేందుకే బీజేపీని వీడి ఉద్ధవ్ ఠాక్రే ఎన్సీపీ, కాంగ్రెస్తో చేతులు కలిపారని నాందేడ్ ర్యాలీలో అమిత్ షా విమర్శలు గుప్పించారు.
Read More