ముంబై : మహారాష్ట్రలోని కొల్హాపూర్లో వివాదాస్పద సోషల్ మీడియా పోస్ట్తో రెండు వర్గాల మధ్య నెలకొన్న ఘర్షణ హింసాత్మకంగా మారడంపై శివసేన (యూబీటీ) నేత, ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) స్పందించారు. యూపీ తరహాలో సంఘ విద్రోహ శక్తులను కాల్చిపారేయాలని ఆయన పేర్కొన్నారు. జూన్ 6న ఇద్దరు వ్యక్తులు టిప్పు సుల్తాన్ ఫొటోతో పాటు ఆడియో మెసేజ్ను సోషల్ మీడియా స్టేటస్గా పెట్టుకోవడం ఘర్షణలకు దారితీయడంతో పట్టణంలో ఉద్రిక్తత నెలకొంది.
గత పదేండ్లుగా మతపరమైన రాజకీయాలు ప్రబలంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిత్యం ప్రమాదంలో పడుతున్నదని అన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ట ఎంతలా మసకబారిందో తెలుస్తోందని దుయ్యబట్టారు. ఇక అంతకుముందు కొల్హాపూర్ ఘర్షణలపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ (Sharad Pawar) స్పందించారు.కొందరు వ్యక్తులు చేసిన పని ఈ పరిస్ధితికి దారితీయడం దురదృష్టకరమని అన్నారు. ఇది సమాజానికి మంచిది కాదని, అల్లర్ల కారణంగా సామాన్య ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. దర్యాప్తు అనంతరం వాస్తవాలు ప్రజల ముందుకు వస్తాయని పేర్కొన్నారు. కాగా, కొల్హాపూర్లో రెండు వర్గాలు బాహాబాహీకి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావడంతో రెండు గ్రూపుల మధ్య వివాదం చెలరేగింది. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు దాడికి దిగడంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. వాట్సాప్ పోస్టుకు నిరసనగా కొన్నిసంస్థలు కొల్హాపూర్ పట్టణ బంద్కు పిలుపునిచ్చాయి. కొల్హాపూర్లో నిరసనకారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పనిచెప్పాల్సి వచ్చింది. పరిస్థితి అదుపు తప్పకుండా నియంత్రించేందుకు పెద్దసంఖ్యలో పోలీసు బలగాలు, బలగాలను పట్టణంలో మోహరించారు.
Read More
Sharad Pawar | శరద్ పవార్కు హత్య బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన సుప్రియా సూలే