ముంబై : శివసేన తిరుగుబాటు నేత, ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేవర్గాన్ని ఎంపీ, శివసేన నేత సంజయ్ రౌత్ పాములతో పోల్చారు. ‘తలను కూడా చితక్కొట్టే నేర్పును నేర్చుకోండి.. పాముల భయంతో అడవిని వీడొద్దు. జై మహారాష్ట్ర’ అంటూ ట్వీట్ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు చెందిన 18 మంది ఎంపీల్లో 12 మంది ఏక్నాథ్ షిండేతో టచ్లో ఉన్నారు. వీరంతా షిండే వర్గంలో చేరనున్నారనే వార్తల మధ్య సంజయ్ రౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. మరో వైపు మహారాష్ట్ర సీఎం సోమవారం ఢిల్లీకి వెళ్లిన విషయం తెలిసిందే. ఎంపీలతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రకటన చేసే అవకాశం ఉన్నది.
18 నుంచి 20 మంది శివసేన లోక్సభ ఎంపీలు తనను 20న కలుస్తారని విశ్వసిస్తున్నట్లు షిండే ఇంతకు ముందు ప్రకటించారు. ఇదిలా ఉండగా.. మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం నేపథ్యంలో శివసేనకు చెందిన ఇరువర్గాలు దాఖలు చేసిన పిటిషన్లపై బుధవారం సుప్రీంకోర్టు విచారించనున్నది. ఈ క్రమంలో సంజయ్ రౌత్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. మహారాష్ట్రను మూడు ముక్కలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, శివసేన శ్రేణులను చీల్చడం కాషాయ పార్టీ కుట్రలో మరో భాగమన్నారు. రాష్ట్రం వరదలతో పోరాడుతుంటే సీఎం ఏక్నాథ్ షిండే శివసేన పార్లమెంటరీ పార్టీని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
పార్టీ, గుర్తు కోసం ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉన్నామన్నారు. కొందరు ఎంపీలు, ఎమ్మెల్యేలు పార్టీని వీడొచ్చు.. వారు మాత్రమే శివసేనను తయారు చేయలేరన్నారు. భవిష్యత్లో ఏ ఎన్నికల్లోనైనా రెబల్స్ గెలవడం కష్టమేనన్నారు. పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఎన్నో ఏళ్లుగా రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా అందించిన సహాయాన్ని రెబల్స్ నేతలకు గుర్తు చేశారు. షిండే బీజేపీ సీఎం అయినందునే ఢిల్లీ పర్యటనలు చేయాల్సి వచ్చిందని సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. ‘శివసేన ముఖ్యమంత్రులు మనోహర్ జోషి, నారాయణ్ రాణే మంత్రివర్గ విస్తరణ, ఇతర సమస్యలపై దేశ రాజధానికి వెళ్లినట్లు నాకు ఎప్పడూ గుర్తులేదు’ అంటూ విమర్శించారు.