Sanjay Raut | శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ)పై శనివారం మండిపడ్డారు. శివసేనలో మెజారిటీ రుజువు చేసుకోవాలని కోరడం ఏమిటని నిలదీశారు. పార్టీ ఎన్నికల గుర్తు కోసం ఆగస్టు 8 లోగా సాక్ష్యాధారాలు సమర్పించాలని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండేలను ఈసీ కోరింది. ఈసీ నిర్ణయం మహారాష్ట్ర ప్రజలను షాకింగ్కు గురి చేసిందని ఏఎన్ఐ వార్తా సంస్థతో శనివారం చెప్పారు. హిందూత్వ సిద్ధాంతాల కోసం 56 ఏండ్ల క్రితం బాలా సాహెబ్ ఠాక్రే శివసేన పార్టీని స్థాపించారని సంజయ్ రౌత్ గుర్తు చేశారు. అటువంటి సంస్థపై ఈసీ ప్రశ్నలు లేవనెత్తుతున్నదన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ తమ పార్టీ శివసేనను పూర్తిగా ధ్వంసం చేయాలని కోరుకుంటున్నదని సంజయ్ రౌత్ మండిపడ్డారు.
ఇప్పటికీ శివసేనకు నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే మాత్రమేనని స్పష్టం చేశారు. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు చేసిన ఏక్నాథ్ షిండే వెంట మెజారిటీ ఎమ్మెల్యేలు వెళ్లడంతో బీజేపీ మద్దతుతో షిండే సీఎంగా బాధ్యతలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో బాల్ఠాక్రే స్థాపించిన పార్టీ నాయకత్వంపై మెజారిటీ సభ్యులతో కూడిన వివరాలు, పత్రాలు సమర్పించాలని ఉద్ధవ్ ఠాక్రే, ఏక్నాథ్ షిండే వర్గాలను ఈసీ ఆదేశించింది. అందుకు శాసనసభాపరమైన, సంస్థాగతమైన విభాగాల మద్దతు లేఖలను ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకుముందు తమదే అసలైన శివసేనగా గుర్తించాలని పేర్కొంటూ ఏక్నాథ్ షిండే వర్గం లేఖ రాసిన నేపథ్యంలో ఈసీ నిర్ణయానికి ప్రాధాన్యం ఏర్పడింది.