అందుకే ఎమ్మెల్యేల తిరుగుబావుటా
బీజేపీపై మండిపడ్డ సంజయ్ రౌత్
రెబల్స్లో పలువురిపై ఈడీ కేసులు
న్యూఢిల్లీ, జూన్ 23: కేంద్ర దర్యాప్తు సంస్థలతో ప్రత్యర్థులను బెదిరించడం, విపక్ష పార్టీల్లో అసమ్మతి రగిల్చి, అవి అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రభుత్వాలను కూల్చేయడం బీజేపీకి నిత్యకృత్యంగా మారింది. ప్రస్తుతం మహారాష్ట్రలో జరుగుతున్న పరిణామాలు ఇందుకు తాజా ఉదాహరణ. శివసేన నేత ఏక్నాథ్ షిండేతో పాటు ఆయన క్యాంపులో ఉన్న దాదాపు 35 మంది అసమ్మతి ఎమ్మెల్యేలు ఈడీ దాడులకు భయపడే తమపై తిరుగుబావుటా ఎగురవేశారని, ఇదంతా బీజేపీ తెర వెనుక ఉండి చేస్తున్నదని శివసేన నేత సంజయ్ రౌత్ ఆరోపించారు. ‘రెబల్ ఎమ్మెల్యేల్లో చాలామందికి ఇప్పటికే ఈడీ నోటీసులు అందినట్లు నాకు సమాచారం ఉన్నది. ఈడీ ద్వారా బీజేపీ వారిపై ఒత్తిడి తీసుకొచ్చింది. మిగతా ఎమ్మెల్యేలపై కూడా ఈడీ నిఘా పెట్టింది. ఏక్నాథ్ షిండే కూడా ఈడీ స్కానర్లో ఉన్నారు’ అని పేర్కొన్నారు.
ఈడీ కేసుల్లో పలువురు
ప్రస్తుతం షిండే క్యాంప్లో ఉన్న ఎమ్మెల్యేల్లో పలువురు ఈడీ, ఐటీ కేసులను ఎదుర్కొంటున్నారు. రెబల్ ఎమ్మెల్యేల్లో ఒకరైన ప్రతాప్ సర్నాయక్ను ఇప్పటికే ఈడీ విచారించింది. రూ. 175 కోట్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ విచారణ జరిగింది. కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా బీజేపీ తమపై ఒత్తిళ్లు తీసుకువస్తున్నదని, ఆ పార్టీతో పొత్తు విషయాన్ని ఠాక్రే పరిగణించాలని ప్రతాప్ గతంలో పలుమార్లు ప్రతిపాదించడం గమనార్హం. ఇక, యామినీ జాదవ్, భావన గవాలీ తదితర ఎమ్మెల్యేలపై కూడా ఈడీ కేసులు నమోదు చేసింది. వీరంతా ప్రస్తుతం షిండే క్యాంపులోనే ఉన్నారు.