ముంబై : కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు, బీజేపీ కుమ్మక్కయ్యాయని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ శుక్రవారం ఆరోపించారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ తర్వాత తమిళనాడు ప్రభుత్వాన్ని మోదీ సర్కార్ టార్గెట్ చేస్తోందని దుయ్యబట్టారు. బీజేపీయేతర రాష్ట్రాలను కేంద్ర దర్యాప్తు సంస్ధలు టార్గెట్ చేస్తున్నాయని మండిపడ్డారు.
బీజేపీ నేత, మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ స్పీకర్కు పెన్డ్రైవ్ ఇచ్చిన ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రతిరోజూ కొత్త పెన్డ్రైవ్ బయటకువస్తోందని..పెన్డ్రైవ్ ఫ్యాక్టరీ ఏమైనా ఉందా అంటూ సంజయ్ రౌత్ ఎద్దేవా చేశారు. కేంద్ర దర్యాప్తు ఏజెన్సీ, బీజేపీ మధ్య అనుబంధం ఉందని పశ్చిమ బెంగాల్లో ఇదే జరిగిందని తమిళనాడులోనూ ఇది పునరావృతం కానుందని రౌత్ స్పష్టం చేశారు.
మహారాష్ట్రలో బీజేపీ నేతలపై రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కుట్ర పన్నారని ఆరోపిస్తూ 125 గంటల వీడియో రికార్డింగ్తో కూడిన పెన్డ్రైవ్ను మహారాష్ట్ర మాజీ సీఎం, విపక్ష నేత దేవేంద్ర ఫడ్నవీస్ స్పీకర్కు అందచేశారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక మహారాష్ట్ర, బెంగాల్ ప్రభుత్వాలను గవర్నర్లు, ఈడీ అధికారులు వేధిస్తున్నారని, బీజేపీ పాలిత రాష్ట్రాలను మాత్రం వారు టార్గెట్ చేయడం లేదని సేన ఎంపీ సంజయ్ రౌత్ ఆరోపించారు.