Sandeshkhali violence: పశ్చిమబెంగాల్లోని సందేశ్ఖాలీ (Sandeshkhali) లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులపై దాడి కేసును కలకత్తా హైకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థకు (CBI) బదిలీ చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ కీలక నాయకుడు షాజహాన్ షేక్ (Shajahan Sheikh) ను కూడా సీబీఐ కస్టడీకి అప్పగించాలని బెంగాల్ పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది.
రేషన్ బియ్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న షాజహాన్ షేక్ ఇంట్లో సోదాల కోసం వెళ్లిన ఈడీ అధికారుల బృందంపై జనవరి 5న ఆయన అనుచరులు దాడి చేశారు. ఈ ఘటన తర్వాత షాజహాన్ షేక్ పరారయ్యారు. ఈ క్రమంలోనే షాజహాన్పై అత్యాచార ఆరోపణలు చేస్తూ సందేశ్ఖాలీ మహిళలు చేసిన ఆందోళన తీవ్ర దుమారం రేపింది. వివాదాస్పదంగా మారిన ఈ కేసును హైకోర్టు తీవ్రంగా పరిగణించడంతో ఫిబ్రవరి 29న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు.
అయితే ఈడీ అధికారులపై షాజహాన్ అనుచరుల దాడికి సంబంధించిన కేసులో దర్యాప్తు నిమిత్తం సీబీఐ, రాష్ట్ర పోలీసుల సంయుక్త సిట్ను ఏర్పాటు చేయాలని హైకోర్టు జనవరి 17న తీర్పునిచ్చింది. దీన్ని సవాల్ చేస్తూ ఈడీ, బెంగాల్ ప్రభుత్వం విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశాయి. దర్యాప్తును పూర్తిగా సీబీఐకి అప్పగించాలని ఈడీ కోరగా.. పూర్తిగా రాష్ట్ర పోలీసులకే ఇవ్వాలని టీఎంసీ సర్కారు అభ్యర్థించింది. ఈ పిటిషన్లపై తాజాగా విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు.. దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.