భువనేశ్వర్: సందర్భం ఏదైనా ఇసుకతో కళాకృతులను సృష్టించే ఇసుక ఆర్టిస్ట్ (Sand artist) సుదర్శన్ పట్నాయక్ (Sudarsan Pattnaik) మరోసారి తన ప్రత్యేకతను చాటుకున్నారు. గతవారం శ్రీరామ నవమి సందర్భంగా ఒడిశాలోని (Odisha) పూరీ సముద్రం తీరంలో (Puri beach) రామ మందిరంతో కూడిన శ్రీరాముని సైకత శిల్పాన్ని నిర్మించిన సుదర్శన్ పట్నాయక్.. తాజాగా గుడ్ ఫ్రైడే సందర్భంగా జీసెస్ క్రైస్ట్ ప్రతిరూపం, శిలువతో కూడిన స్యాండ్ స్కల్ప్చర్ (Sand sculpture) వేశారు. దానిపై గుడ్ ఫ్రైడే (Good Friday), ప్రేయర్ ఫర్ పీస్ (Prayer For Peace) అని రాసుకొచ్చారు.
క్రైస్తవ మతంలో ఈస్టర్కు ముందు శుక్రవారం నాడు పాటించే ఒక స్మారక రోజును గుడ్ ఫ్రైడేగా చెబుతారు. ఇది ఏసుక్రీస్తును శిలువ వేసిన రోజు. కల్వరిలో ఆయన మరణాన్ని గుర్తుచేసుకునే క్రైస్తవ సెలవుదినం. ఈ రోజుకు జ్ఞాపకార్థంగా ఏసును స్మరించుకుంటూ గుడ్ ఫ్రైడేగా పాటిస్తారు. క్రైస్తవ మత చరిత్ర గ్రంథాల ప్రకారం.. గుడ్ ఫ్రైడే అనేది ఒక సంతాప దినం.
Odisha | Sand artist Sudarsan Pattnaik created a sand sculpture on 'Good Friday' at puri beach. (06.04) pic.twitter.com/9pfXqyTJjq
— ANI (@ANI) April 6, 2023
తనను సిలువ వేసి, తన దేహానికి శీలలు కొడుతున్న వారిని కూడా క్షమించాలని భగవంతుడిని వేడుకున్న మహోన్నత క్షమాగుణ సంపన్నుడు ఏసుక్రీస్తు అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ‘గుడ్ఫ్రైడే’ సందర్భంగా ప్రజలకోసం ఏసుక్రీస్తు చేసిన త్యాగాలను సీఎం స్మరించుకున్నారు. ‘గుడ్ఫ్రైడే’ క్రైస్తవులకు పరమ పవిత్రమైన రోజని పేర్కొన్నారు. సమస్త మానవాళి పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల జాలి, అవధులులేని త్యాగం, సడలని ఓర్పు, శత్రువుల పట్ల క్షమాగుణం అనే గొప్ప లక్షణాలను కలిగి ఉండటం కరుణామయుడైన ఏసుక్రీస్తుకే సాధ్యమైందని కొనియాడారు.
ఈ లక్షణాలను ప్రతి ఒకరూ పుణికి పుచ్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు. శాంతి, సహనం, అహింస, సౌభ్రాతృత్వాలను క్రీస్తు తన ఆచరణీయమైన జీవితం ద్వారా సమస్త మానవాళికి సందేశంగా ఇచ్చాడని సీఎం కేసీఆర్ తెలిపారు. విభేదాలు, తారతమ్యాలు లేకుండా మనుషులంతా ఒకటిగా కలిసి ఉండేందుకు ఏసుక్రీస్తు బోధనలు ఎంతగానో దోహదం చేస్తాయని పేర్కొన్నారు. గుడ్ఫ్రైడేను ప్రజలు భక్తిశ్రద్ధలతో, దైవప్రార్థనలతో జరుపుకోవాలని, ప్రజల మధ్య శాంతి, సామరస్యం విలసిల్లాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.