న్యూఢిల్లీ: బాలీవుడ్ ప్రముఖుల ఇండ్లపై 2013లో ఐటీ దాడులు జరిగినప్పుడు ఎటువంటి సమస్య తలెత్తలేదని, ఇప్పుడు అది సమస్యగా మారిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు. ‘ఒక ప్రభుత్వ హయాంలో ఇది (ఐటీ దాడులు) జరిగితే అది ఫైన్. ఈ ప్రభుత్వ హయాంలో దాడులు జరిగితే మాత్రం ఫైన్ కాదు. ఇదే వ్యక్తులపై 2013లో ఐటీ దాడులు జరిపింది. అప్పుడు లేని సమస్య ఇప్పుడెందుకు తలెత్తింది’ అని శుక్రవారం మీడియాతో అన్నారు.
వ్యక్తుల ఆధారంగా మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా పన్ను ఎగవేతకు పాల్పడినప్పుడు దేశ ప్రయోజనాల కోసం దాడులు జరిగాయని నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘ముందు ఒక విషయం తెలుసుకోండి. నేను ఏ, బీ వ్యక్తుల గురించి మాట్లాడటం లేదు. (కానీ) పేర్లు ప్రస్తావనకు వస్తే (నేను చెప్పదలుచుకున్నదేమిటంటే) 2013లోనూ ఇదే వ్యక్తుల ఇండ్లపై ఐటీ దాడులు జరిగాయి’ అని ఇండియన్ ఉమెన్ ప్రెస్ కార్ప్స్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో అన్నారు.
బాలీవుడ్ కథా నాయిక తాప్సీ పన్ను, సినీ నిర్మాత అనురాగ్ కశ్యప్ ఇండ్లు, కార్యాలయాలపై ఈ నెల మూడో తేదీన ఐటీ శాఖ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. తాప్సీ, అనురాగ్ కశ్యప్తోపాటు వారి భాగస్వాములకు చెందిన 30 ఆస్తులపై ఈ దాడులు జరిగాయి.