బీజేపీ పెద్ద అబద్ధాల కోరు పార్టీ అని సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. బీజేపీ చెప్పేంత అబద్ధాలు ప్రపంచంలో ఏ పార్టీ చెప్పదని ఎద్దేవా చేశారు. వారణాసి వేదికగా జరిగిన ఎన్నికల ప్రచారంలో అఖిలేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచంలో అత్యధిక సభ్యులున్న పార్టీ తమదేనని బీజేపీ పదే పదే చెబుతుందని, అయితే.. దానంత అబద్ధాలు చెప్పే పార్టీ చరాచర విశ్వంలోనే లేదని మండిపడ్డారు.
రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని బీజేపీ పదే పదే చెప్పిందని, నిజంగా రైతుల ఆదాయం రెట్టింపైందా? అంటూ అఖిలేశ్ ప్రశ్నించారు. ఐదేళ్లలో యువకులు ఉద్యోగాల కోసం కళ్లల్లో వత్తులు పెట్టుకొని చూశారని, ఉద్యోగాలు ఇచ్చారా? అంటూ ఆయన నిలదీశారు. ఎయిర్ పోర్టులు మొదలు సీ పోర్టుల వరకూ అన్నింటినీ బీజేపీ అమ్మేస్తోందంటూ విరుచుకుపడ్డారు.