సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ మంగళవారం పార్టీ మేనిఫెస్టోను ప్రకటించారు. 2025 కల్లా రైతులను రుణ విముక్తులను చేస్తామని అందులో హామీ ఇచ్చారు. ఇక.. కేంద్రం తీసుకొచ్చిన సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ చేసిన పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన రైతు కుటుంబాలకు 25 లక్షల చొప్పున నష్ట పరిహారాన్ని కూడా చెల్లిస్తామని అఖిలేశ్ ప్రకటించారు. ఇక రైతు పండించే పంటలన్నింటికీ కనీస మద్దతు ధర వచ్చేలా చూస్తామని, చెరుకు రైతులు పంట అమ్మిన 15 రోజుల్లోగా డబ్బు వచ్చేలా చూస్తామని కూడా సమాజ్వాదీ తన మేనిఫెస్టోలో పొందుపరిచింది.
ఇక రెండెకరాల భూమి వున్న వారికి రెండు డీఏపీ బస్తాలు, 5 బోరీ యూరియా బస్తాలు కూడా ఉచితంగా ఇస్తామన్నారు. ఇక… దారిద్య్ర రేఖకు దిగువన కుటుంబాలకు యేడాది రెండు సార్లు ఉచితంగా ఎల్పీజీ సిలిండర్లు ఇస్తామని, 300 లోపు యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ అందిస్తామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. ఇక.. బైక్ నడిపించే వారికి ప్రతి నెలా ఒకసారి ఉచితంగా పెట్రోల్ అందిస్తామని, ఆటో నడిపించే వారికి మూడు లీటర్ల పెట్రోలు, లీటర్ సీఎన్జీ గ్యాస్ ఉచితంగా ఇస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఇక.. తాము అధికారంలోకి వస్తే సమాజ్వాదీ క్యాంటీన్లను తెరుస్తామని, 10 రూపాయలకే భోజనాన్ని ఇస్తామని అఖిలేశ్ ప్రకటించారు.
మహిళలు, వృద్ధులు, వికలాంగులకు యేడాదికి 18 వేలు పింఛన్ ఇస్తామని అఖిలేశ్ హామీ ఇచ్చారు. ఇక.. తాము అధికారంలోకి వస్తే పల్లెలు, పట్టణాల్లో సీసీటీవీలు, డ్రోన్ల ద్వారా శాంతిభద్రతలను పర్యవేక్షిస్తామని, ప్రజలకు రక్షణ ఇస్తామని కూడా అఖిలేశ్ హామీ ఇచ్చారు.