ఓ వైపు సీఎంగా యోగి ఆదిత్యనాథ్, ఆయన మంత్రివర్గం ప్రమాణం చేస్తుండగానే సమాజ్వాదీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన యోగి, ఆయన మంత్రి వర్గ బృందానికి అఖిలేశ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవం అటల్ బిహారీ వాజ్పాయ్ ఏకనా స్టేడియంలో జరిగింది. అయితే.. ఈ స్టేడియం తమ హయాంలోనే నిర్మించామని, ఇప్పుడు ఈ స్టేడియంలో యోగి ఆదిత్యనాథ్ ప్రమాణ స్వీకార మహోత్సవం జరిగిందని అఖిలేశ్ ట్వీట్లో ప్రస్తావించారు.
కొత్తగా కొలువు దీరిన ప్రభుత్వానికి శుభాకాంక్షలు. మేము నిర్మించిన స్టేడియంలోనే ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడానికే ఈ ప్రమాణ స్వీకారం కాదు. ప్రజలకు మంచి సేవలందించడానికి కావాలి అంటూ అఖిలేశ్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.
ఈ స్టేడియం సమాజ్వాదీ హయాంలో నిర్మితమైంది. 2018 లో అఖిలేశ్ ప్రభుత్వం ఈ స్టేడియానికి మాజీ ప్రధాని అటల్ బిహారీ పేరు పెట్టింది. ఇందులో ఓ టీ 20 మ్యాచ్ కూడా జరిగింది. దాదాపు 50 వేల మంది కూర్చునే కెపాసిటీ ఈ స్టేడియం సొంతం.