Sam Pitroda : భారత పౌరుల నైపుణ్యాలు (Indians skills) బయటి దేశాలకు సేవలు చేసేందుకే దోహదపడుతున్నాయని, దేశంలో సుమారు 150 కోట్ల జనాభా ఉన్నా సొంతంగా ఆపరేటింగ్ సిస్టమ్ (Operating system) లేకపోవడం సిగ్గుచేటని కాంగ్రెస్ పార్టీ (Congress party) ఓవర్సీస్ ఛైర్మన్ శామ్పిట్రోడా (Sam Pitroda) విమర్శించారు. ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఓ ఇంటర్వ్యూలో పిట్రోడా చేసిన ఈ వ్యాఖ్యలపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
‘భారత యువతలో ఎంతో ప్రతిభ ఉంది. వారి నైపుణ్యాలను వినియోగించడంలో భారత్ విఫలమైంది. మన యువతను ఇతర దేశాలు విరివిగా వాడుకుంటున్నాయి. ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, న్యాయశాస్త్రం, పరిశ్రమలు.. ఇలా ఎన్నో రంగాల ఆవిష్కరణల్లో మన యువతే ప్రధానపాత్ర పోషిస్తోంది. సుమారు 150 కోట్ల జనాభా ఉన్న భారత్లో మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ లేదు. మన ప్రతిభతో కనీసం ఫోన్కు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ను తయారు చేయలేకపోతున్నాం’ అని పిట్రోడా వ్యాఖ్యనించారు.
పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఆయన అబద్ధాలతో భారత్ను ఎగతాళి చేస్తున్నారని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. లినక్స్ (BOSS Linux), మాయ ఓఎస్ (Maya OS), ప్రైమ్ ఓఎస్ (PrimeOS), భార్ ఓఎస్ (BharOS), ఇండస్ ఓఎస్ (Indus OS) నెక్స్ట్ క్వాంటమ్ (Nxt Quantum) ఆపరేటింగ్ సిస్టమ్లను భారత్ అభివృద్ది చేసిందని ఆయన గుర్తుచేశారు.