డెహ్రాడూన్: కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ ఇంటిని కొందరు ధ్వంసం చేశారు. అయోధ్య తీర్పుపై ఆయన రాసిన పుస్తకంలో హిందుత్వాన్ని ఉగ్రవాదంతో పోల్చారు. దీనిపై వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో ఉత్తరాఖండ్ నైనిటాల్లోని ఖుర్షీద్ ఇంటికి కొందరు నిప్పుపెట్టారు. దీంతో ప్రధాన ద్వారం తలుపు కాలిపోయింది.
సల్మాన్ ఖుర్షీద్ స్వయంగా ఈ విషయాన్ని ఫేస్బుక్ ద్వారా తెలిపారు. తన ఇంటి ధ్వంసానికి సంబంచిన ఫొటోలు, వీడియోలను అందులో పోస్ట్ చేశారు. ‘ఇది హిందూమతం కాదని నేను ఇప్పటికీ తప్పుగా చెప్పానా?’ అని ప్రశ్నించారు. ‘ఇప్పుడు అలాంటి చర్చ జరుగుతోంది. కాబట్టి సిగ్గు అనేది చాలా పనికిమాలిన పదం. అంగీకరించినా, అంగీకరించకపోయినా ఏదో ఒక రోజు మనమంతా కలిసి దీనిపై తర్కించగలమని నేను ఇప్పటికీ ఆశిస్తున్నాను’ అని ఖుర్షీద్ అందులో పేర్కొన్నారు.
కాగా, ఒక వీడియోలో ఖుర్షీద్ ఇంటి డోర్కు నిప్పుపెట్టిన వ్యక్తులు బీజేపీ జెండాలు పట్టుకోవడంతోపాటు జై శ్రీరామ్, హర హర మహాదేవ్ అంటూ నినాదాలు చేశారు.