న్యూఢిల్లీ : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం నేపధ్యంలో పార్టీలో అసమ్మతి స్వరాలు పెరుగుతున్న వేళ పార్టీ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ అగ్ర నాయకత్వాన్ని వెనకేసుకొచ్చారు. ఈ సంక్షోభ సమయంలో పార్టీకి గాంధీ కుటుంబ సభ్యుల నాయకత్వమే మేలని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పార్టీ పూర్తికాల అధ్యక్షుడిగా రాహుల్ గాంధీ బాధ్యతలు చేపట్టాలని పలువురు పార్టీ నేతలు కోరుతున్నారని చెబుతూ సంస్ధాగత ఎన్నికల అనంతరం రాహుల్ ఈ దిశగా చొరవ చూపుతారని తాను ఆశిస్తున్నానని అన్నారు. గాంధీ కుటుంబ నాయకత్వాన్ని విమర్శించిన మరో సీనియర్ నేత కపిల్ సిబల్తో ఖుర్షీద్ విభేదించారు. పార్టీలో ప్రస్తుతం తలెత్తిన విభేదాలు, వివాదాలతో బీజేపీకి లబ్ధి చేకూరుతుందని కాంగ్రెస్ పార్టీకి ఎంతమాత్రం మేలు చేయదని అసంతృప్తులకు హితవు పలికారు.
కాంగ్రెస్ నాయకత్వాన్ని గాంధీ కుటుంబం వేరొకరికి అప్పగించి తప్పుకోవడానికి ఇదే సరైన సమయమని కపిల్ సిబల్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో మరోసారి నాయకత్వ అంశంపై చర్చకు తెరతీశాయి. గాంధీ కుటుంబం స్వచ్ఛందంగా నాయకత్వం నుంచి తప్పుకోవాలని వారిచే నియమించబడిన వారెవరూ గాంధీ కుటుంబాన్ని అగ్ర నాయకత్వం నుంచి తప్పుకోమని ఎన్నటికీ కోరరని సిబల్ స్పష్టం చేశారు.