న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: భారత్కు 114 రఫేల్ యుద్ధ విమానాల అమ్మకం కోసం జరుగుతున్న చర్చల్లో భాగంగా స్పెక్ట్రా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్, ఇతర ముఖ్యమైన ఎలక్ట్రానిక్ సిస్టమ్ల కోసం కీలకమైన సోర్స్ కోడ్లను బదిలీ చేయడాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం గట్టిగా తోసిపుచ్చినట్లు ఆ దేశ వాణిజ్య పత్రిక ఎసెన్షియల్ డే ఎకో వెల్లడించింది. ఈ ఆంక్షల కారణంగా ఫ్రాన్స్ ఆమోదం, మద్దతు లేకుండా భారత్ స్వతంత్రంగా కొన్ని సెన్సార్లు, ఆయుధాలను అనుసంధానించే లేదా విమాన సాఫ్ట్వేర్ను ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది.
సోర్స్ కోడ్ లేకుండా భారత్ స్వదేశీ ఆయుధాల కోసం రఫేల్ను వేగంగా ప్రోగ్రామ్ చేయలేకపోయిందని, డేటా లింక్ ఇంటర్ ఆపరేబిలిటీని ఆప్టిమైజ్ చేయలేకపోయిందని అమెరికా వైమానిక దళ మాజీ లెఫ్టినెంట్ జనరల్ డేవిడ్ డెఫ్టులా ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇది ఆపరేషన్ సిందూర్ సమయంలో ఒక రఫేల్ కోల్పోవడానికి దోహదపడిందని ఆయన చెప్పారు. అయితే పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో రఫేల్ యుద్ధ విమానం నష్టాన్ని భారత్ ఎప్పుడూ అధికారికంగా అంగీకరించలేదు. కాగా, 2025 జూలై 8న సీఎన్బీసీ-టీవీ18కి ఇంటర్వ్యూ ఇచ్చిన భారత రక్షణ కార్యదర్శి ఆర్కే సింగ్ ‘రఫేల్స్ అని మీరు బహు వచనంలో మాట్లాడారు, కానీ అది కచ్చితంగా తప్పని నేను హామీ ఇవ్వగలను’ అని చెప్పారు.
దీన్ని బట్టి 2025 మే 7న పాకిస్థాన్తో జరిగిన సైనిక ఘర్షణలో భారత్ ఒక రఫేల్ యుద్ధ విమానాన్ని నష్టపోయిందని ఆయన పరోక్షంగా అంగీకరించినట్లయింది. వార్తా కథనం ప్రకారం ఈ సోర్స్ కోడ్లను దశాబ్దాలుగా అభివృద్ధి చేసిన ఫ్రాన్స్ వీటిని యాజమాన్య ఉత్పత్తులుగా పరిగణిస్తున్నది. వీటిని మరే ఇతర దేశంతోనూ పంచుకోలేమని ఫ్రాన్స్ తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 13న భారత్ రక్షణ కార్యదర్శి సింగ్ భారతీయ ఆయుధాలు, భారతీయు వ్యవస్థలను రఫేల్ విమానంలో అనుసంధానించడానికి పూర్తి అధికారం భారత్కు ఉంటుందని చెప్పారు.
కొన్ని వార్తా సంస్థలు మాత్రం ప్లగ్ అండ్ ప్లే అనే మధ్యేమార్గాన్ని సూచిస్తున్నాయి. ఇక్కడ ఫ్రాన్స్ పూర్తి సోర్స్ కోడ్కు బదులుగా అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్(ఏపీఐ)లను అందించే అవకాశం ఉంది. యాజమాన్య హక్కుల జోలికి పోకుండా భారత్ తన సొంత వ్యవస్థలను అనుసంధానం చేసుకోవడానికి ఈ మార్గం అవకాశం కల్పిస్తుంది. యూఏఈ రఫేల్ కోసం ప్లగ్ అండ్ ప్లే సామర్థ్యాన్ని ఇప్పటికే అమలు చేస్తున్న మరో దేశం.