Sakshi Kochhar | న్యూఢిల్లీ : కేవలం 18 ఏండ్లకే భారత్లో కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన అతి పిన్న వయస్కురాలిగా సాక్షి కొచ్చర్ రికార్డు సృష్టించింది. అంతకు ముందు 19 ఏండ్ల వయసులో మరో మహిళా పైలట్ మైత్రీ పటేల్ సాధించిన రికార్డును సాక్షి తిరగరాసింది. సాక్షి, మైత్రీ ఇద్దరూ కెప్టెన్ ఏడీ మాణెక్ వద్దే శిక్షణ పొందడం విశేషం. హిమాచల్ ప్రదేశ్లోని పర్వనా పట్టణానికి చెందిన సాక్షి తన ఫ్లయింగ్ గంటల లక్ష్యాన్ని ఏడున్నర నెలల్లోనే పూర్తి చేసి చిన్న వయస్సులోనే కమర్షియల్ పైలట్ లైసెన్స్ పొందిన మహిళగా ఘనత సాధించింది.
12వ తరగతి పూర్తి చేసిన తర్వాత ముంబైలోని స్కైలైన్ ఏవియేషన్ క్లబ్లో సాక్షి చేరింది. అమెరికాలో ఉన్నత శిక్షణ పూర్తి చేసుకున్న ఆమెకు అక్కడ కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఇచ్చారు. తన తల్లిదండ్రులు మధ్య తరగతికి చెందినవారైనప్పటికీ ఎంతో ప్రోత్సహించి శిక్షణ ఇప్పించారని సాక్షి తెలిపింది. పైలట్ శిక్షణకు తనకు రూ. 70 లక్షల వరకు ఖర్చయిందని, ఉద్యోగం వచ్చిన తర్వాత తన కుటుంబాన్ని ఆదుకుని, అప్పంతా తీర్చేస్తానని ఆమె పేర్కొంది.