Sagarika Ghose: రాజ్యసభ ఎన్నికల కోసం పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (TMC) పార్టీ నలుగురు అభ్యర్థులను ఖరారు చేసింది. వారిలో మహిళా జర్నలిస్టు సాగరిక ఘోష్, టీఎంసీ నాయకులు సుస్మితా దేవ్, మహ్మద్ నదీముల్ హక్, మమతా ఠాకూర్ ఉన్నారు. ఈ విషయాన్ని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేసింది.
‘రాజ్యసభ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థులుగా సాగరిక ఘోష్, సుస్మితా దేవ్, మహ్మద్ నదీముల్ హక్, మమతా ఠాకూర్ పేర్లను ప్రకటిస్తున్నందుకు సంతోషిస్తున్నాం. వారందరికీ శుభాకాంక్షలు. తృణమూల్ కాంగ్రెస్ నామినేట్ చేసిన వీరంతా భారతీయుల హక్కుల కోసం వాదించే మా పార్టీ వారసత్వాన్ని నిలబెట్టేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నాం’ ఎక్స్లో టీఎంసీ పేర్కొంది. ఈ ట్వీట్ను సాగరిక ఘోష్ రీట్వీట్ చేశారు.
కాగా, సాగరిక ఘోష్ ప్రముఖ పాత్రికేయుడు రాజ్దీప్ సర్దేశాయ్ సతీమణి. ప్రఖ్యాత మీడియా సంస్థల్లో పనిచేసిన ఆమె జర్నలిజంలో అనేక అవార్డులు సాధించారు. పలు పుస్తకాలు కూడా రాశారు. దేశ వ్యాప్తంగా ఏప్రిల్లో ఖాళీ కానున్న 56 స్థానాలకు కేంద్ర ఎన్నికల సంఘం జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసింది. బెంగాల్లో మొత్తం 5 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఫిబ్రవరి 8 నుంచి రాజ్యసభ ఎన్నిలకు నామినేషన్ల స్వీకరణ మొదలవ్వగా ఆఖరు తేదీ ఫిబ్రవరి 15. ఫిబ్రవరి 27న పోలింగ్ నిర్వహిస్తారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లపను లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.