కర్ణాటక బీజేపీ నేత ఈశ్వరప్ప
శివమొగ్గ, మే 30: కర్ణాటక మాజీ మంత్రి, బీజేపీ నేత కేఎస్ ఈశ్వరప్ప వివాదాస్పద వ్యాఖ్యలతో మరోసారి వార్తల్లోకి ఎక్కారు. భవిష్యత్తులో ఏదొక రోజున త్రివర్ణ పతాకం స్థానంలో కాషాయ జెండా జాతీయ జెండాగా మారుతుందని. ఇందులో ఎలాంటి అనుమానం లేదని వ్యాఖ్యానించారు.
కాషాయ జెండాకు దేశంలో చాలా కాలంగా గౌరవం ఉందని, వేల ఏండ్ల చరిత్ర ఉందని, కాషాయ జెండా త్యాగాలకు ప్రతీక అని చెప్పుకొచ్చారు. రాజ్యాంగం ప్రకారం జాతీయ జెండాగా ఉన్న త్రివర్ణ పతాకానికి తగిన గౌరవం ఇస్తామని అన్నారు. కేఎస్ ఈశ్వరప్ప గతంలో కూడా జాతీయ జెండా విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలోని ఎర్రకోటతో పాటు దేశంలోని అన్ని ప్రాంతాల్లో కాషాయ జెండా ఎగురవేస్తామని ఫిబ్రవరి 9న ఓ సందర్భంగా వ్యాఖ్యానించారు.